రోడ్డు యక్సిడెంట్లు, పాము కాట్లు వంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్ అనేది చాలా కీలకం. ప్రమాదం జరిగిన గంటలోపు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తే.. గాయాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. గాయపడిన వ్యక్తి బతికే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ అత్యవసర వైద్య సహాయం అందించాలంటే.. అంబులెన్స్లు కీలకం. అయితే రాష్ట్రంలో అంబులెన్స్ల కొరత ఉంది. ఉన్నవాటిలోనూ కొన్ని అంబులెన్స్లు తరచూ రిపేర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో 190 కొత్త 108 వాహనాలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
గోల్డెన్ అవర్లోపే వైద్యం..
ఇప్పుడున్న అంబులెన్స్లతో పాటు కొత్తగా ప్రారంభించనున్న 190 కొత్త అంబులెన్స్లు.. రోగులు, క్షతగాత్రులను మరింత వేగంగా ఆస్పత్రులకు తరలించేందుకు వీలవుతుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్వహణ సరిగా లేక.. డొక్కు, తుక్కుగా తయారై.. తరచూ రిపేర్ అవుతున్న అంబులెన్స్లను తొలగిస్తామని చెప్పారు. వాటి స్థానంలో కొత్త అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఫలితంగా గోల్డెన్ అవర్లోనే క్షతగాత్రులు వైద్యం సహాయం పొందుతారన్నారు.
త్వరలో ప్రారంంభించనున్న 190 కొత్త 108 వాహనాల్లో.. 56 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, 136 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 650 అంబులెన్స్లు నడుస్తున్నాయని.. పాత వాటిని తొలగించి.. కొత్త వాటితో కలిపితే.. వాహనాల సంఖ్య 731కు చేరుకుంటుందని మంత్రి వివరించారు. గత ప్రభుత్వంలో నీలం, ఆకుపచ్చ రంగుల్లో అంబులెన్స్లు ఉండేవని చెప్పిన సత్య కుమార్.. కొత్త అంబులెన్స్లు నేషనల్ అంబులెన్స్ కోడ్ ప్రకారం తెలుగు, ఎరుపు రంగుల్లో ఉంటాయని వెల్లడించారు. గత నెలలోనే ప్రభుత్వం ఈ మేరకు పాత రంగులు మార్చుతున్నట్లు తెలిపింది.
గత ప్రభుత్వం పట్టించుకోలేదు..
ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ 108 అంబులెన్స్లను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అంబులెన్స్ల నిర్వహణను పట్టించుకోలేదని.. వాల కాలం చెల్లిన అంబులెన్స్లను ఉపయోగించిందని అన్నారు. ఫలితంగా ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తరలించడంలో జాప్యం జరిగిందన్నారు. 108 అంబులెన్స్ల ప్రతిస్పందన సమయం పెరిగిందని మంత్రి ఆరోపించారు.
2023 జులైలో తరచూ మరమ్మతులకు గురవుతున్న పాత అంబులెన్స్ల స్థానంలో అప్పటి ప్రభుత్వం 146 కొత్త 108 అంబులెన్స్లను ప్రారంభించింది. వీటి కోసం రూ. 34.79 కోట్లను ఖర్చు చేసింది. ఈ సందర్భంగా 2020లో 412 కొత్త అంబులెన్స్లను తీసుకొచ్చినట్లు వైఎస్ జగన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa