ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఒక సినిమాను తలపించే ఘటన వెలుగు చూసింది. తన భార్య మరొక వ్యక్తితో హోటల్లో ఉందన్న సమాచారంతో రగిలిపోయిన ఓ భర్త.. అక్కడ కనిపించిన ఓ అమాయకుడిని ప్రియుడిగా పొరబడ్డాడు. స్నేహితులతో కలిసి అతడిని కిడ్నాప్ చేసి, ఇనుప రాడ్లతో దారుణంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. అయితే, కథలో ఊహించని మలుపు ఏమిటంటే, ఆ వ్యక్తి నిరపరాధి అని, అసలు తన ప్రియుడు వేరొకరు అని భార్య చెప్పడంతో విషయం మరింత సంక్లిష్టంగా మారింది.వివరాల్లోకి వెళితే, ఝాన్సీలోని మౌరానిపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి తన భార్య ప్రియుడితో కలిసి స్థానిక హోటల్లో ఉందన్న సమాచారం అందింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతను, తన స్నేహితులతో కలిసి ఆ హోటల్కు వెళ్లాడు. అదే సమయంలో, సోను అనే యువకుడు ఓ పని మీద హోటల్కు వచ్చాడు. హోటల్ నుంచి బయటకు వెళ్లేందుకు సదరు మహిళ సోను సహాయం కోరింది. సరిగ్గా అప్పుడే అక్కడికి చేరుకున్న భర్త, సోనునే తన భార్య ప్రియుడని అపార్థం చేసుకున్నాడు. అసలు ప్రియుడు ఆ గందరగోళంలో అక్కడి నుంచి తప్పించుకున్నాడు.భర్త, అతని స్నేహితులు సోనును బలవంతంగా తమ దుకాణానికి తీసుకెళ్లి ఇనుప రాడ్లతో చితకబాదారు. ఈ దాడిలో సోనుకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సోను తండ్రి, సోదరుడిపై కూడా వారు దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న మౌరానిపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు."అపార్థం కారణంగానే రాజేశ్, ముఖేశ్ మరికొందరు కలిసి ప్రమోద్పై దాడి చేశారని ప్రాథమికంగా తెలిసింది" అని మౌరానిపూర్ సీఓ మనోజ్ కుమార్ తెలిపారు. తాను కేవలం సహాయం చేయబోతే తనపై దాడి జరిగిందని బాధితుడు సోను పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.అయితే, ఈ కేసులో అసలు ట్విస్ట్ నిందితుడి భార్య స్టేట్మెంట్తో బయటపడింది. "నాకు సోనుతో ఎలాంటి సంబంధం లేదు. నేను కలవడానికి వెళ్లిన వ్యక్తి వేరే అతను. నా భర్త పొరపాటున మా పక్కింట్లో ఉండే సోనును అపార్థం చేసుకున్నాడు" అని ఆమె పోలీసులకు చెప్పింది. ఈ అనూహ్య ఘటనతో ఓ నిరపరాధి ఆసుపత్రి పాలవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa