అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లుకు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇది అన్యాయం అంటూ కోర్టు మెట్లెక్కింది యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్. ట్రంప్ నిర్ణయం ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్ చట్టాలని ఉల్లంఘిస్తుందని పేర్కొంది. కొత్త ఫీజు.. వలస, జాతీయత చట్టం నిర్దేశించిన పరిమితులను మించి ఉందని పిటిషన్లో వెల్లడించింది. వీసా ఛార్జీలు ప్రభుత్వ పరిపాలనా ఖర్చులను మాత్రమే ప్రతిబింబించాలని చాంబర్ తన ఫిర్యాదులో వాదించింది.
అది అసాధ్యం..
ఈ సందర్భంగా అమెరికా కామర్స్ చాంబర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ పాలసీ ఆఫీసర్ నీల్ బ్రాడ్లీ మాట్లాడారు. అధిక వీసా ఫీజు వల్ల అమెరికా కంపెనీలకు.. ముఖ్యంగా స్టార్టప్లు, చిన్న వ్యాపారాల చాలా ఇబ్బంది కలుగుతుందన్నారు. నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను నియమించుకోవడం దాదాపు అసాధ్యం అని అన్నారు. అమెరికాలో ఉన్న చిన్న, పెద్ద కంపెనీలన్నీ.. వీదేశీ కార్మికులను నియమించుకుని.. తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ హెచ్1బీ వీసా విధానాన్ని రూపొందించిందని వెల్లడించారు.
అమెరికాకు వారి అవసరం ఉంది..
డొనాల్డ్ ట్రంప్ సరిహద్దు భద్రత, ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లైతే.. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత విస్తరించడానికి నైపుణ్యం కలిగిన కార్మికులు ఇంకా అవసరమని చాంబర్ విశ్వసిస్తున్నట్లు బ్రాడ్లీ పేర్కొన్నారు. అయితే వీసా ప్రక్రియను సులభతరం చేసి.. అమెరికాలో విదేశీ ట్యాలెంట్ను నియమించుకునేందుకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ సంస్కరణలకు చాంబర్ మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ట్రంప్ అనేక విధానాలు తీసుకొస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా శాశ్వత వృద్ధి అనుకూల పన్ను సంస్కరణలను తీసుకురావడం, వృద్ధికి ఆటంకంగా ఉన్న అతి నియంత్రణను తొలగించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. వీటితో పాటు అమెరికాలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి ట్రంప్ ప్రతిపాదనలకు.. అమెరికా కామర్స్ చాంబర్ మద్దతు ఇస్తోందన్నారు. అయితే ఈ ఆర్థిక వృద్ధి సాధించాలంటే అధిక శ్రామికి శక్తి అవసరమని.. అందుకోసం ఎక్కువ మంది కార్మికులు కావాలని అని బ్రాడ్లీ పేర్కొన్నారు. కాగా, హెచ్1బీ వీసాదారుల్లలో అత్యధిక మంది భారతీయులే ఉన్నారు. ట్రంప్ నిర్ణయం వారి కలలను ఆవిరి చేసింది.
హెచ్1బీ వీసా ప్రోగ్రామ్పై ఆధారపడిన కంపెనీల కోసం చట్టబద్ధమైన, ఆచరణాత్మక వ్యవస్థను రూపొందించడానికి కాంగ్రెస్, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధం అని కామర్స్ చాంబర్ తెలిపింది. అయితే యూఎస్ కామర్స్ చాంబర్ అనేది.. అమెరికాలోని కంపెనీలు ఇందించే నిధులతో, వాటి ప్రయోజనాల కోసం లాబీయింగ్ సంస్థగా పనిచేస్తుంది. తాజా పరిణామంతో.. వీసా ఫీజు పెంపుపై అమెరికా కంపెనీలు గుర్రుగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇదే నిజమైతే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గట్టిగా పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి. చట్టవిరుద్ధం అని తేలితే ట్రంప్ ఆదేశాలు చెల్లవు. దీన్ని బట్టి చూస్తే విదేశీ నిపుణులు అమెరికా కంపెనీలకు అవసరం అని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa