ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దశాబ్దాలుగా పాక్ పెంచిన ఉగ్రవాదం ఇప్పుడు కాల్చేస్తోంది.. అసిమ్ మునీర్‌పై ఆఫ్గన్ మాజీ ఎంపీ ఫైర్

international |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 08:40 PM

పాకిస్తాన్ , ఆఫ్గనిస్థాన్ ‌ల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రం అయ్యాయి. 48 గంటల కాల్పుల విరమణ ముగిసిన వెంటనే.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్ వైమానిక దాడులకు తెగబడడంతో.. ఆఫ్గనిస్థాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌పై పాక్ జరిపిన ఈ దాడిలో మొత్తం 10 మంది మరణించగా అందులో ముగ్గురు యువ క్రికెటర్లు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇది పిరికిపంద చర్య అంటూ ఆఫ్గనిస్థాన్ తీవ్రంగా మండిపడుతోంది. ఆఫ్గన్‌ మాజీ ఎంపీ మరియం సోలైమాంఖిల్‌ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


తాజాగా మీడియాతో మాట్లాడిన మరియం సోలైమాంఖిల్.. పాక్ చేసిన దాడులను పిరికిపంద చర్యగా అభివర్ణించారు. భారత్‌పై, ఆఫ్గన్‌పై పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ, పాక్ సైన్యం దశాబ్దాలుగా ఉగ్రవాద హింసకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్‌ లక్ష్యంగా చేసుకుంటూ మరియం సోలైమాంఖిల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి.. వారిని ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని.. ఇప్పుడు వారు ఎగదోసిన మంటే.. వారి సొంత ఇంటిని (పాకిస్తాన్) కాల్చేస్తోందని గుర్తుపెట్టుకోండని పేర్కొన్నారు. ఈ వ్యవస్థీకృత ఉగ్రవాదానికి పాకిస్తానే కారణమని మండిపడ్డారు. పాక్ చేస్తున్న ఈ దాడులను ఖండిస్తూ.. అమాయక యువ క్రికెటర్లు, చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకరమని మరియం సోలైమాంఖిల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


ఇటీవల ఆఫ్గన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ముత్తాఖీ భారత్ పర్యటనకు సంబంధించిన విషయాన్ని మరియం సోలైమాంఖిల్ ప్రస్తావించారు. భారత్‌కు ఆఫ్గన్ దగ్గరవ్వడాన్ని పాకిస్తాన్ సహించలేకపోతోందని.. తమ రెండు దేశాల మధ్య శాంతిని పాక్ చూడలేకపోతోందని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద భావజాలానికి వ్యతిరేకంగా భారత్-ఆఫ్గన్‌ల మధ్య బలమైన సహకారం ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.


శుక్రవారం అర్ధరాత్రి పాకిస్తాన్.. ఆఫ్గనిస్థాన్‌పై వైమానిక దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 17వ తేదీ నుంచి పాకిస్తాన్, శ్రీలంక జట్లతో ఆడాల్సిన టీ20 ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీబీ ప్రకటించింది. దీంతో దాడుల ప్రభావం క్రీడాకారులపైనా తీవ్రంగా పడింది. రెండు దేశాల మధ్య ఇటీవల కుదిరిన 48 గంటల కాల్పుల విరమణ పూర్తి అయిన వెంటనే ఈ దాడులు జరగడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa