అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోలు వ్యవహారంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును కొంత మేర తగ్గించిందని.. భవిష్యత్తులో ఆ కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి ఉంటూ.. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. శనివారం రోజున వాషింగ్టన్లోని వైట్హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే మీడియాతో మాట్లాడిన ట్రంప్.. హంగేరీ దేశం ఉదాహరణను ప్రస్తావించారు.
రష్యా నుంచి చమురు కొనడాన్ని ఆపమని హంగేరీ దేశానికి కూడా నేను చెప్పానని ట్రంప్ అన్నారు. కానీ వాస్తవానికి హంగేరీకి సముద్ర తీరం లేదని చెప్పారు. భౌగోళికపరమైన అనివార్య పరిస్థితుల వల్ల ఆ దేశం రష్యా నుంచే చమురును కొనాల్సి వస్తోందని ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యల వల్ల సముద్ర మార్గంలో చమురును దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నందున.. భారత్కు రష్యా చమురును నిలిపివేయడానికి మరింత సౌలభ్యం ఉందని పరోక్షంగా సూచించారు. కొన్ని రోజుల క్రితం రష్యా నుంచి చమురును కొనేది లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ నాకు హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటన చేశారు. దాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
దేశ ప్రజల ప్రయోజనాల ప్రకారమే తమ ఇంధన వనరులను సమకూర్చుకుంటామని భారతదేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోమే తన పరువును కాపాడుకునే ప్రయత్నంలోనే ట్రంప్ తాజా కామెంట్స్ చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఘర్షణలను ఆపానని ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాను ఇప్పటి వరకు 8 సైనిక ఘర్షణలను ఆపినట్లు పేర్కొన్నారు. వాటిలో రువాండా - కాంగో, ముఖ్యంగా భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణలను ఆపిందీ తానేనని ట్రంప్ ఉద్ఘాటించారు.
అణ్వస్త్రాలు కలిగిన భారత్ - పాకిస్థాన్ వంటి దేశాల సైనిక ఘర్షణను ఆపడం చాలా పెద్ద విషయం అని పేర్కొన్నారు. తన వల్లే ఆ రెండు దేశాల్లోని లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు రక్షణ లభించిందని పాకిస్థాన్ ప్రధానమంత్రి స్వయంగా చెప్పారని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనే తన ప్రయత్నాలు త్వరలోనే ఫలించబోతున్నాయని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ యుద్ధం కూడా ఆగబోతోందని.. దీంతో తాను ఆపిన యుద్ధాల సంఖ్య 9కి చేరుతుందని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa