అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. తమతో సరైన వాణిజ్య ఒప్పందం చేసుకోకపోతే చైనా ఉత్పత్తులపై టారిఫ్లను 155 శాతం వరకు పెంచాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి.వైట్హౌస్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. "చైనా ఇప్పటివరకు మాతో చాలా గౌరవంగానే ఉంది. టారిఫ్ల రూపంలో మాకు భారీ మొత్తంలో డబ్బు చెల్లిస్తోంది. ప్రస్తుతం వారు 55 శాతం చెల్లిస్తున్నారు. ఒకవేళ నవంబర్ 1 లోపు మేం ఒక ఒప్పందానికి రాకపోతే, ఈ టారిఫ్లు 155 శాతానికి చేరే అవకాశం ఉంది" అని ట్రంప్ స్పష్టం చేశారు. గతంలో చాలా దేశాలు అమెరికాను తమ స్వార్థానికి వాడుకున్నాయని, కానీ ఆ రోజులు పోయాయని ఆయన వ్యాఖ్యానించారు.ఇప్పటికే చైనా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అమెరికా 55 శాతం సుంకాలు విధిస్తోంది. దీనికి అదనంగా మరో 100 శాతం టారిఫ్లు, కీలకమైన సాఫ్ట్వేర్లపై ఎగుమతి ఆంక్షలు నవంబర్ 1 నుంచి అమలు చేయాలని ట్రంప్ యంత్రాంగం యోచిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలతో ఆ ప్రణాళికలకు మరింత బలం చేకూరింది. చైనా వాణిజ్య విధానాలపై తన వైఖరిని మరింత కఠినతరం చేయాలనే ట్రంప్ ఉద్దేశం ఈ హెచ్చరికలతో స్పష్టమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa