ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు యూఏఈ పర్యటనలో ఏపీకి రూ.100 కోట్లు విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 07:12 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రపంచస్థాయి గ్రంథాలయం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ దిశగా కీలక అడుగు పడింది. రాజధాని అమరావతిలో గ్రంథాలయం నిర్మాణానికి శోభా గ్రూప్ రూ.100 కోట్లు విరాళం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ పర్యటనలో.. శోభా గ్రూప్ ఫౌండర్, చైర్మన్ పీఎన్సీ మీనన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రూ.100 కోట్లతో అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు శోభా గ్రూప్ ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు రూ.100 కోట్ల విరాళం ప్రకటించటంపై చంద్రబాబు వారిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పీ4 విధానంలో భాగంగా పేదరిక నిర్మూలన కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వారికి వివరించారు.


అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నట్టు తెలిపిన సీఎం..రాజధాని నిర్మాణంలో శోభా రియాల్టి సంస్థ కూడా భాగస్వామి కావాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని శోభా గ్రూప్ ఛైర్మన్ పీఎన్సీ మీనన్‌ను కోరారు.శోభా రియాల్టీ లాంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సరైన గమ్యస్థానం ఏపీ అని పేర్కొన్నారు. మూడేళ్లలో రాజధాని అమరావతిలో రహదారులు, నీటి సదుపాయం, నైపుణ్యం ఉన్న మానవ వనరులు వంటి మౌలిక సదుపాయాలు సిద్ధం చేస్తామన్నారు. విశాఖలో గూగుల్ డేటా ఏఐ హబ్, అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు కానున్నాయని చంద్రబాబు వివరించారు. తిరుపతి, విశాఖ, అమరావతికి ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయని వివరించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని శోభా గ్రూప్ ఫౌండర్ ఛైర్మన్ మీనన్‌ను చంద్రబాబు ఆహ్వానించారు.


అమరావతిలో రూ.150 కోట్లతో లైబ్రరీ


మరోవైపు 150 కోట్ల రూపాయలతో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నారు. ఈ లైబ్రరీ నిర్మాణం ప్రారంభించిన 24 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనితో పాటుగా రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో మోడల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేయనున్నారు.కొత్త జిల్లాల ప్రాతిపదికన మోడల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. గ్రంథాలయాల అభివృద్ధికి విరాళాలు స్వీకరించాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో రూ.20 కోట్లతో మోడల్‌ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa