ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీల్లో అత్యంత భారీ వర్షాలు.. అనవసర ప్రయాణాలు వద్దన్న ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 07:16 PM

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరికొన్ని గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. వచ్చే ఐదు రోజుల పాటు ఆంధ్రపదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శనివారం వరకూ మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని అప్రమత్తం చేశారు.


మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రోజున పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 8:30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 18.3 మిమీ సగటు వర్షపాతం నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సగటు వర్షపాతం తిరుపతి జిల్లాలో 92.3 మిమీ. నెల్లూరు జిల్లాలో 60.8మిమీ, చిత్తూరు జిల్లాలో39.5మిమీ, అన్నమయ్య జిల్లా 37.7 మిమీ, కడప జిల్లా 22.9, ప్రకాశం జిల్లా 24.9మి.మీలుగా నమోదైనట్లు తెలిపింది. బుధవారం కూడా ఒంగోలు, కడప, నెల్లూరులో భారీ వర్షం కురిసింది.


భారీ వర్షాలు.. ప్రయాణాలు వద్దు..


మరోవైపు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా,రాయలసీమలో అతిభారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో హోం మంత్రి అనిత ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో పాటుగా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దని అనిత సూచించారు. అలాగే సహాయక చర్యల కోసం NDRF, SDRF, పోలిస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.


జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని.. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని హోం మంత్రి సూచించారు. ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa