ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. భీమవరం డీఎస్పీ జయసూర్య పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని.. సివిల్ వివాదాల్లోనూ ఆయన తలదూరుస్తున్నారంటూ డీఎస్పీ జయసూర్యపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ వ్యవహారం ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకూ చేరిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి మంగళవారం ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలి మీద నివేదికను సమర్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. డీఎస్పీ స్థాయి అధికారి అసాంఘిక కార్యక్రమాలకు అండగా ఉండటం ఏమిటంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకూడదని.. అలాంటి విషయాలను తమ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో పేకాట శిబిరాల నిర్వహణ, వీటిపై పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు, ఆ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో తెలియజేయాలని డీజీపీని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యకు మద్దతుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలి మీద డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తే.. డిప్యూటీ స్పీకర్ సపోర్టుగా మాట్లాడటం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
తనకున్న సమాచారం మేరకు భీమవరం డీఎస్పీ జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో పేకాట, జూదంపై పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేశారన్నారు. అందుకే భీమవరం డీఎస్పీ జయసూర్యపై అభియోగాలు వస్తున్నాయేమోనని రఘురామకృష్ణరాజు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో ఎలాంటి జూద శిబిరాలు లేవని రఘురామ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపుతోందని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. అయితే డీఎస్పీ తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నివేదిక కోరటం.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆయనకు అనుకూలంగా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు భీమవరం డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయినట్లు తెలిసింది. ఈ భేటీలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే డీఎస్పీ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa