ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రైలు ప్రయాణికులకు.. త్వరలో అందుబాటులోకి ఆ స్టేషన్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 07:29 PM

ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వేస్టేషన్లకు మంచి రోజులు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అమృత్ భారత్‌ స్టేషన్స్‌ పథకంలో భాగంగా.. కడప, రాజంపేట రైల్వేస్టేషన్లు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే రూ. 20.35 కోట్లతో కడప రైల్వే స్టేషన్ పనులు ప్రారంభం అయ్యాయి. అయితే పనులు పూర్తి కాకపోవడంతో అంచనా వ్యయం రూ. 30 కోట్లకు చేరింది. ఈ సవరించిన అంచనాల ప్రకారం త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో వచ్చే సంవత్సరంలో కడప స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


కడప రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు 18 నెలల్లో పూర్తిచేయాలని మొదట నిర్ణయించారు. అయితే గడువు దాదాపుగా పూర్తైనా ఇప్పటికీ పనులు జరగలేదు. పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థల్లో ఒకటి ఇప్పటికే పూర్తి చేసింది. ఇంకా మరో రెండు సంస్థలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ సంస్థలు చేసే పనులు పూర్తి కావాలంటే దాదాపు 6 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


అత్యాధునిక హంగులతో..


కడప రైల్వే స్టేషన్ మొదటి, రెండో ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 200 మీటర్ల మేర ఫ్లోరింగ్‌ను పూర్తి చేశారు. స్టేషన్‌లో బుకింగ్, పార్శిల్‌ కార్యాలయాలతో పాటు సెక్యూరిటీ, ఏసీ వెయిటింగ్‌ హాల్, నాన్‌ ఏసీ వెయిటింగ్‌ హాల్, రైల్వేస్టేషన్‌ మేనేజర్, సీసీఐ, సీటీఐ, రైలు నెట్‌ కార్యాలయాలను నిర్మిస్తున్నారు. ఏసీ, నాన్‌ఏసీ డార్మెటరీ, రిటైరింగ్‌ గదుల నిర్మాణ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇంతేకాకుండా 12 మీటర్ల మేర ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, ఎస్కలేటర్, లిప్టులను ఏర్పాటు చేయాల్సి ఉంది. రైల్వే స్టేషన్‌లో రోడ్లు, పార్కింగ్‌ సౌకర్యాల పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ పూర్తి చేసి వచ్చే ఏడాది చివరి నాటికి రైల్వే స్టేషన్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


రాజంపేట రైల్వే స్టేషన్ పనులు..


ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట రైల్వే స్టేషన్‌లో.. రూ. 4 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి. పార్కింగ్‌ స్థలం పునరుద్ధరణతో పాటు, డిస్‌ప్లే బోర్డులు, ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేయడం వంటి పనులు ఇప్పటికే చేపట్టారు. ఇక వెయిటింగ్‌ హాల్‌ను మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్‌ కూడా త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజంపేట, కోడూరు, నందలూరు రైల్వేస్టేషన్లలో పలు ప్రధాన రైళ్లను నిలిపేందుకు ఇటీవల రైల్వే బోర్డు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.


అమృత్ భారత్ పథకం కింద నంద్యాల రైల్వే స్టేషన్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ స్టేషన్ ఆధునికీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అమృత్ భారత్ పథకం కింద నంద్యాల స్టేషన్‌కు రూ.21 కోట్లు మంజూరు చేయగా.. మొదటి విడతలో రూ.14 కోట్లతో పనులు మొదలుపెట్టారు. త్వరలో మరో రూ.7 కోట్లతో రెండో విడత పనులు మొదలు కానున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa