ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరి చేతుల్లో ఫోన్లు లేవు.. పొట్టల్లేవ్.. సరదాగా ముచ్చట్లు.. ఇన్ఫోసిస్ క్యాంటీన్ వీడియో వైరల్!

business |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 09:02 PM

ఐటీ/సాఫ్ట్‌వేర్ కార్యాలయాల్లో ఒకప్పుడు కాస్త విరామం దొరికితే సహచరులు, సహోద్యోగులతో సరదాగా సంభాషణలు, కలిసి భోజనం చేస్తూ పరిచయాలు పెంచుకోవడం ఇలా ఉండేది. చేతుల్లో ఫోన్లు ఉండేవి కావు. బ్లూటూత్, హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఇవేమీ లేవు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాస్త టైమ్ దొరికితే చాలు ఫోన్లలోనే ప్రపంచం ఉందన్నట్లుగా అవే పనిగా చూస్తుంటారు. చెవుల్లో బడ్స్ తప్పనిసరి. పక్కనవారి గురించి పట్టించుకునే పరిస్థితి ఎక్కడిది. ఇంకా.. జంక్ ఫుడ్ సరేసరి. దీంతో ఎలాగూ ఊబకాయం బారిన కూడా పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే.. భారత ఐటీ రంగం వృద్ధి చెందుతున్న.. 1990 ల స్వర్ణ యుగాన్ని తలపించే అరుదైన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ బెంగళూరు క్యాంటీన్‌కు చెందినటువంటి ఒక పాత క్లిప్.. టెక్ ప్రపంచంలో అప్పుడు ఉద్యోగుల జీవితం, జీవనం ఎలా ప్రశాంతంగా ఉండేదో చూపించడంతో.. చాలా మంది పాత ఉద్యోగులు తమ జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటున్నారు. నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం అంతా.. ఒత్తిళ్లు, టార్గెట్లతోనే జీవితం గడుస్తుందని వాపోతున్నారు.


>> అర్జున్ అనే ఒక యూజర్.. ట్విట్టర్‌లో (x) ఈ ఇన్ఫోసిస్ ఫుటేజీని పోస్ట్ చేశాడు. ఇక్కడ 1990ల నాటి బెంగళూరు ఇన్ఫోసిస్ క్యాంటీన్ ఫుటేజీ అని క్యాప్షన్ ఇస్తూ.. దీంట్లో చాలా మంది మల్టీ మిలియనీర్లు అయ్యారని.. చాలా వరకు విదేశాల్లో స్థిరపడి ఉండొచ్చని చెప్పాడు. ఇక ఈ వీడియోను అక్టోబర్ 18న పోస్ట్ చేయగా.. 4 రోజుల వ్యవధిలోనే ఏకంగా 54 లక్షల మందికిపైగా చూడటం విశేషం. 24 వేలకుపైగా లైక్స్, 2500 కుపైగా రీపోస్ట్స్ కనిపించాయి. దీనిపై ఐటీ నిపుణులు, ఉద్యోగులు సహా ఇతర ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.


 ఇక్కడ అర్జున్ షేర్ చేసిన వీడియోలో.. యువ ఐటీ ఉద్యోగులు గుంపులు గుంపులుగా కూర్చొని నవ్వుతూ.. మాట్లాడుకుంటూ భోజనం చేస్తుండటం గమనించొచ్చు. వారి చేతుల్లో సెల్ ఫోన్స్ గానీ, ఇతర గాడ్జెట్స్ గానీ ఏం లేవు. ఇక దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూ.. తమ పాత రోజుల్ని గుర్తుచేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.


'అంతా ఎంత సన్నగా (స్లిమ్‌), యవ్వనంగా ఉన్నారు. ఒక్కరికి కూడా పొట్ట కనిపించట్లేదు. ఎవరూ మొబైల్ ఫోన్లలో మునిగిపోలేదు. అంతా రిలాక్స్‌డ్‌గా తమ బ్రేక్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటి యువత మాత్రం అలసిపోయినట్లు, వయసు మళ్లినట్లు కనిపిస్తున్నారు.' అని సునీత సాయమ్మగారు అనే పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. మరొకరు.. 'నీట్‌గా షేవ్ చేసుకున్నారు. మంచి ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నారు. చేతుల్లో ఫోన్లు లేవు. ఏఐ ఉద్యోగ ఆందోళన లేదు. వాస్తవమైన నవ్వులు, స్నేహాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఐటీలో పనిచేయడానికి అదొక అద్భుతమైన యుగం.' అని కామెంట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa