మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఫల్టన్ సబ్ జిల్లా ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య రాష్ట్రంలో కలకలం సృష్టించింది. గురువారం రాత్రి ఆమె ఒక హోటల్ గదిలో ఉరి వేసుకుని కన్పించారు. అయితే, మృతురాలి అరచేతిపై రాసిన సూసైడ్ నోట్ తీవ్ర సంచలనం కలిగించింది. గడిచిన ఐదు నెలలుగా ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ తనపై నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆ నోట్లో ఆమె స్పష్టంగా పేర్కొనడం జరిగింది.
మృతురాలు తన సూసైడ్ నోట్లో సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బద్నే పేరును నేరుగా ప్రస్తావించారు. ఎస్సై బద్నే తనను పలుమార్లు లైంగికంగా వేధించాడని, మరొక పోలీసు ప్రశాంత్ బంకర్ మానసికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు. ఈ వేధింపులే తన ఆత్మహత్యకు కారణమయ్యాయని ఆమె రాశారు. ఈ కేసులో పోలీసులు ప్రాథమిక దర్యాప్తు జరిపి, ఆత్మహత్యకు ప్రేరేపించడం, అత్యాచారం వంటి ఆరోపణల కింద కేసు నమోదు చేశారు.
మరణించిన డాక్టర్ గతంలోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎస్పీ, డీఎస్పీలకు ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ విషయం రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి వెళ్ళగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సతారా పోలీసులను ఆదేశించింది. ముఖ్యమంత్రి కూడా ఈ ఘటనపై స్పందించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించడం జరిగింది.
ప్రస్తుతం, మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. అరచేతిపై రాసిన సూసైడ్ నోట్ను ఆధారంగా చేసుకుని పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వేధింపులతో ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవడం, అదీ తన చేతిపై సూసైడ్ నోట్ రాయడం రాష్ట్రంలో భద్రత, మహిళల రక్షణ విషయంలో తీవ్ర చర్చకు దారితీసింది. నిందితులను త్వరగా పట్టుకుని, శిక్షించాలని ప్రజలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ దారుణ ఘటనపై పోలీసు శాఖలో కూడా అంతర్గత విచారణకు ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa