ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పన్నులు ఎగ్గొట్టడానికి,,,,తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ కంపెనీల గిమ్మిక్కులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 07:20 PM

తెలుగు రాష్ట్రాల్లోని ట్రావెల్స్ బస్సులకు ఎక్కువగా NL, DD, PY, AR నంబర్ ప్లేట్లు ఉండటం ఎప్పుడైనా గమనించారా? ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్.. ఇలాంటి బస్సులు ఎక్కువగా ఉపయోగిస్తాయి. అంతేకాకుండా పాత బస్సులను ఇలాంటి రాష్ట్రాల్లో టూరిస్ట్ బస్సుల్లా రిజిస్టర్ చేయించి.. తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతున్నారు. తాజాగా కర్నూలులో ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును కూడా డామన్ డయ్యూలో రిజిస్టర్ అయింది. సీటింగ్ పర్మిషన్ తీసుకుని స్లీపర్‌గా మార్చారు. రవాణా పన్నులు తప్పించుకోవడంతో పాటు పలు కారణాల వల్ల ట్రావెల్స్ కంపెనీలు ఇలా చేస్తున్నాయి.


  ఈశాన్య రాష్ట్రాల్లో రవాణా పన్ను మినహాయింపు ఉంటుంది. అందుకే తక్కువ పన్నులు ఉంటాయి. కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో పన్నుల్లో ఇలా రాయితీలు ఇస్తారు. పర్మిట్ ఛార్జీలు కూడా తక్కువగా ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు, వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడానికి రాయితీలను ప్రభుత్వం ఒక సాధనంగా ఉపయోగించుకుంటోంది. దాన్ని ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీలు సొమ్ము చేసుకుంటాయి. అందుకే ఇలాంటి రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తాయి.


తాజాగా ప్రమాదానికి గురైన బస్సును డామన్ డయ్యూలో రిజిస్టర్ చేశారు. అక్కడ ఒక్క సీటుకు కేవలం రూ.450 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే తెలుగు రాష్ట్రాల్లో రూ. 4500 చెల్లించాలి. అదే స్లీపర్ బస్సు అయితే రూ.12000 పన్ను కట్టాల్సి ఉంటుంది. అలా మొత్తంగా రిజిస్ట్రేషన్‌కు రూ. లక్షలు కట్టాల్సివస్తుంది.


ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్..


ట్రక్కులకు ఆల్ ఇండియా పర్మిట్ ఉన్నట్లే.. భారత్ ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ అనేది కూడా ఉంటుంది. ఆ పర్మిట్ ఉన్న వాహనాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా తిరగొచ్చు. అందుకే ట్రావెల్స్ కంపెనీలు అయా రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసిన బస్సులను.. ఏపీ-తెలంగాణ, తెలంగాణ- కర్ణాటక వంటి అంతరాష్ట్ర రూట్లలో తిప్పుతాయి. నాగాలాండ్‌, సిక్కింలో రిజిస్టర్ అయిన కారణంగా.. తమ బస్సుకు ఆల్ ఇండియా పర్మిట్ ఉందని చూపిస్తారు.


తప్పుడు అడ్రస్ మోసాలు


కొన్ని ట్రావెల్స్ కంపెనీలు తప్పుడు పత్రాలు సమర్పించి.. నాగాలాండ్ లేదా పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బస్సులను రిజిస్టర్ చేయిస్తాయి. అలాంటి ప్రాంతాల్లో ఆర్టీఓ అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో కమిషన్ తీసుకుని ఇలాంటి వాటికి అనుమతిస్తారని ఆరోపణలు వస్తున్నాయి.


కఠిన నిబంధనలు..


భారత్‌లో ఆర్టీఏ నిబంధనలు వివిధ రాష్ట్రాల్లో వేరుగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వాహన నియంత్రణ, ఫిట్‌నెస్ చెక్, లైసెన్స్ రెన్యువల్ కఠినంగా ఉంటాయి. అందుకే ఈ రాష్ట్రాల ఆర్టీఏ నియంత్రణను తప్పించుకోవడానికి.. ఇతర రాష్ట్రాల నంబర్ ప్లేట్లు ఉన్న బస్సులు నడుపుతారు.


ఇంతకుముందు ఇలాంటి కేసుల్లో జరిగిన దర్యాప్తుల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగాలాండ్ లేదా పుదుచ్చేరి వంటి రాష్ట్రాల నంబర్ ప్లేట్లతో ఉన్న బస్సులు.. ఆయా రాష్ట్రాలకు చెందిన వారిపై రిజిస్టర్ అయి ఉంటాయి. కానీ వాటి నిజమైన ఓనర్లు మాత్రం ఏపీ, తెలంగాణలో ఉండే కంపెనీలే. లీజు పేరుతో బస్సులను తిప్పుతాయి. ఇలా జరగడం వల్ల చాలా రాష్ట్రాలు పన్ను ఆదాయాన్ని కోల్పోతున్నాయి. అంతకుమించి ఫిట్‌నెస్ లేని బస్సులను నిబంధనలు పాటించకుండా నడపడం వల్ల.. అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కొన్ని రోడ్డు ప్రమాదాల్లో బస్సు ఏ రాష్ట్రానికి చెందిందో గుర్తించడమే కష్టం అవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa