తనది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం.. నెల్లూరులోని ఓ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీకి వెళ్లేందుకని అక్టోబర్ 8వ తేదీ నర్సాపురం - ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలులో రిజర్వేషన్ చేసుకుంది. అయితే ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో తనకు వెయిటింగ్ లిస్ట్ 31 వచ్చింది. దీంతో టీటీని బతిమాలుకుని.. సీటు సంపాదించుకుని నెల్లూరు వెళ్దామంటూ రైల్వేస్టేషన్ చేరుకుందా ఆ యువతి. సమయం సాయంత్రం ఐదు నిమిషాలకు తక్కువ ఆరైంది. తను వెళ్లాల్సిన నర్సాపురం- ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలు వచ్చేసింది. సీటు రిజర్వేషన్ కాలేదు.. ఏం చేయాలో తెలీదు.. టీటీని బతిమాలితే సీటు కన్ఫామ్ అయ్యేవరకూ S7లోని ఏడో సీట్లో కూర్చోమన్నారు.సాధారణంగా రైళ్లలో టీటీకీ కేటాయించే సీటది.. టీటీ తనకు పెద్ద మనసుతో సీటిచ్చాడనుకుంటూ.. ఆ యువతి ఆ సీట్లో కూర్చుంది.
నర్సాపురం దాటిన రైలు.. అప్పుడే యవ్వారం మొదలు..
రైలు వేగంగా పరుగులు తీస్తోంది.. బోగీలో జనం పలుచగా ఉన్నారు. టీటీ తనకు కన్ఫామ్ సీటు ఇస్తాడా ఇవ్వాడా, సీటు దొరక్కపోతే నెల్లూరు వరకూ ప్రయాణం ఎలా చేయాలనే అనే సందేహం ఆ యువతి మదిలో మెదులుతూనే ఉంది. ఇంతలో డ్యూటీ మీద వెళ్లిన టీటీ రానే వచ్చాడు. వచ్చి తన పక్కనే కూర్చున్నాడు. తన పేరు అభిజిత్ అంటూ పరిచయం చేసుకున్నాడు. సీటు గురించి టెన్షన్ వద్దని.. సీటు కన్ఫామ్ చేస్తానంటూ మాటలు మొదలెట్టాడు. ఆ మాటలు కోటలు దాటి.. చేతలు మొదలెట్టాడు.
పైకి మంచిగానే మాట్లాడుతున్నాడు. కానీ చేసే చేతలే వేరేగా ఉన్నాయి. మాటలు ఒకలా.. చూపులు మరోలా.. చేతలు ఇంకోలా.. టీటీ చేస్తున్న పనులతో చలికాలంలోనూ ఆ అమ్మాయి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. సీటు కన్ఫామ్ చేస్తానంటూ నడుం మీద, భుజం మీద..ప్రైవేట్ భాగాల మీద చేతులు వేస్తూ టీటీలోని మరో కోణం బయటకు వచ్చింది. అరుద్దామంటే చుట్టూ ఎవరూ లేని పరిస్థితి.. ఏం చేయలేని స్థితి..ఇంతలోనే ఏదో స్టేషన్ వచ్దింది. కొంతమంది ప్రయాణికులు రైలెక్కారు. అమ్మాయి కాస్త ఊపిరి పీల్చుకుంది.
ఏసీ బోగీలో సీటు ఇస్తానని చెప్పి..
అయితే ఆ తర్వాత ఏసీ బోగీలో సీటు ఇస్తానంటూ యువతికి చెప్పిన టీటీ.. అక్కడకు తీసుకెళ్లాడు. కింద సీట్లో పడుకోమని యువతికి చెప్పిన టీటీ అభిజిత్.. కాసేపటికే మరోసారి తన అసలు స్వరూపం బయటపెట్టుకున్నాడు. టీటీ వెకిలి చేష్టలతో కంగారుపడిపోయిన యువతికి ఏం చేయాలో తోచలేదు. పైపెచ్చు ఆ బాక్సులో ఎవరూ లేకపోవటంతో మరింత భయపడిపోయింది. విజయవాడ శివారు ప్రాంతంలో ట్రైన్ ఆగటంతో.. టీటీ అభిజిత్, వాష్ రూమ్ కోసమని వెళ్లాడు.
దీంతో ఇదే అదనుగా అక్కడి నుంచి బయటపడిన యువతి.. ప్రయాణికులు ఉన్న బోగీలోకి చేరుకుంది. వారికి టీటీ వ్యవహారం చెప్పింది. వారి సాయంతో విజయవాడ జీఅర్పీ అధికారులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధించిన టీటీ అభిజిత్ మీద చర్యలు తీసుకోవాలని కోరింది. మరోవైపు ఈ వ్యవహారంలో రైల్వే అధికారులు టీటీ అభిజిత్కు మెమో జారీ చేశారు. అలాగే యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు భీమవరం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa