ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దూసుకొస్తున్న మొంథా తుపాను.... విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 26, 2025, 04:43 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుపాను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై సన్నాహక చర్యలు చేపట్టింది. అన్ని శాఖల అధికారులను కూడా అప్రమత్తం చేసింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోందని వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ఈ వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం సమయానికి ఈ వాయుగుండం పోర్ట్ బ్లెయిర్‌కి 620 కి.మీ, చెన్నైకి 780 కి.మీ, విశాఖపట్నానికి 830 కి.మీ, కాకినాడకు 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపారు.


తుపాను మంగళవారం రాత్రికి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తుపాను తీరం దాటేటప్పుడు బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. భారీ వర్షాలు, గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు తుపాను సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైనా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది.


తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు


పుకార్లను నమ్మకూడదు, భయపడకూడదు, ప్రశాంతంగా ఉండాలి.అత్యవసర కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఫోన్లను ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి. వాతావరణ హెచ్చరికలు కోసం మెసేజ్‌లను గమనిస్తూ ఉండాలి. తుపాను సమయంలో అవసరమైన వస్తువులతో "అత్యవసర వస్తు సామగ్రిని" సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలి.విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, ఇతర విలువైన డాక్యుమెంట్లను వాటర్ ప్రూఫ్ కవర్లలో భద్రపరచుకోవాలి.


భారీ వర్షాలు, ఉరుములు, మెరుపుల సమయంలో ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఎలక్ట్రికల్ పరికరాలు, గ్యాస్ కనెక్షలను తీసివేయాలి. తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి.ఒకవేళ ఇల్లు సురక్షితం కాదనుకుంటే, తుపాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ప్రదేశాలకు చేరుకోవాలి. పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్లు స్తంభాల కింద నిలబడకూడదు. పశువులు, పెంపుడు జంతువులకు కట్టిన తాళ్లను విప్పి,వాటికి వదిలివేయాలి. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు. అత్యవసర సహాయం కోసం 112, 1070, 1800 425 0101 నంబర్లకు ఫోన్ చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa