మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన నుంచి బంగ్లాదేశ్తో భారత్ సంబంధాలు క్షీణిస్తూ వస్తున్నాయి. మొదటి నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు యూనస్. భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. తాజాగా మహమ్మద్ యూనస్ మరో దుస్సాహసానికి పాల్పడ్డారు. భారత భూభాగాన్ని బంగ్లాదేశ్కు చెందినదిగా చూపిస్తూ ఉన్న మ్యాప్ను.. పాకిస్థాన్ జనరల్ షంషాద్ మీర్జాకు బహూకరించారు. ఆ మ్యాప్లో అస్సాంతో పాటు భారత ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్లో భాగంగా ఉన్నాయి. దీనిపై భారత్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
దాదాపు యాభై ఏళ్ల క్రితం పాక్తో తెగదెంపులు చేసుకుంది బంగ్లాదేశ్. బంగ్లాకు స్వాతంత్ర్యం రావడానికి భారత్ ముఖ్య పాత్ర పోషించింది. ఆ తర్వాత భారత్- బంగ్లాదేశ్ స్నేహంగా ఉన్నాయి. అయితే ఇటీవల పరిస్థితులు మొత్తం మారిపోయాయి. మళ్లీ బంగ్లా.. పాకిస్తాన్ పంచన చేరుతోంది. ఇరు దేశాల మధ్య బంధాలు చిగురిస్తున్నాయి. బంగ్లాదేశ్ సైన్యానికి పాక్ ట్రైనింగ్ ఇచ్చే విషయంపైనా ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో పాక్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ షాహిర్ షంషాద్ మీర్జా.. బంగ్లా వచ్చారు. ఈ సందర్భంగా యూనస్-మీర్జా సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి వచ్చిన పాక్ జనరల్కు యూనస్ ‘ఆర్ట్ ఆఫ్ ట్రియంఫ్’ పేరిట ఉన్న పుస్తకాన్ని బహూకరించారు.
యూనస్ దుస్సాహసం..
యూనస్ బహుమతిగా ఇచ్చిన ఆ బుక్ కవర్ పేజీపై.. భారత్కు చెందిన ఏడు ఈశాన్య రాష్ట్రాలు.. బంగ్లాదేశ్లో భాగంగా చిత్రీకరించారు. అయితే ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్న భారతీయులు.. ఇక ఈ ఈస్ట్ పాకిస్తాన్ను (బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి ముందు) ఉపేక్షించొద్దని అంటున్నారు. యూనస్.. అమెరికా పప్పెట్ అంటూ మండిపడుతున్నారు. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు.
భారత ఈశాన్య ప్రాంతంపై బంగ్లాదేశ్ గతంలో చాలా సార్లు అక్కసు వెల్లగక్కింది. భారత ఈశాన్య రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అంటారని.. వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదని అని యూనస్ అన్నారు. ఈ ప్రాంతంలో సముద్రానికి తామే రక్షకులం ప్రేలాపనలు పేలారు. ఇక చైనా ఆర్థిక బేస్ను విస్తరించుకోవడానికి మంచి అవకాశం, అనుకూలం అంటూ.. భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చిన భారత్.. బంగాళాఖాతంలో భారత్కు 6,500 కిలోమీటర్లు మేర పొడవైన తీరం ఉందని గుర్తు చేసింది. అంతేకాకుండా ఐదు బిమ్స్టెక్ దేశాలతో సరిహద్దును కలిగి ఉన్నామని.. ముఖ్యంగా మా ఈశాన్య ప్రాంతం బిమ్స్టెక్ కనెక్టివిటీ హబ్గా వృద్ధి చెందుతోందని చరకలు అంటించారు భారత విదేశాంగ మంత్రి జై శంకర్. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్లు, పైప్లైన్ నెట్వర్క్లతో ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం వరకు కనెక్ట్ అవుతోందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa