ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఈ భూమి మీదే అత్యంత ప్రమాదకరమైన రోడ్డు'.., వీడియో వైరల్

national |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 09:05 PM

సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచే బెంగళూరు నగరంలో దారుణమైన మౌలిక సదుపాయాలపై రోజుకో వార్త వెలువడుతోంది. మీడియా, సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు బెంగళూరు రోడ్లు , ఇతర సౌకర్యాలపై తీవ్ర దుమారం రేపుతోంది. బెంగళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్‌లోని వర్తూర్ మెయిన్ రోడ్డు పరిస్థితిని వివరిస్తూ మాజీ జర్నలిస్ట్ జైషా అమ్లాని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన రోడ్డుపైకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అంటూ ఆ వీడియోను జైషా అమ్లాని పోస్ట్ చేశారు. బొలీవియాలోని డెత్ రోడ్ (నార్త్ యుంగాస్ రోడ్), కర్దుంగ్ లా పాస్ కంటే కూడా ఈ బెంగళూరు రోడ్డు తీవ్ర ప్రమాదకరమని ఆమె ఆరోపించారు.


ఇక వర్తూర్ మెయిన్ రోడ్డు మొత్తం బురద, భారీ గుంతలతో నిండిపోయి ఉందని ఆ వీడియోలో జైషా అమ్లాని చూపించారు. ఒక గుంత ఏకంగా 117 అంగుళాల పొడవు, 56 అంగుళాల వెడల్పు ఉందని టేపు సాయంతో కొలతలు వేసి మరీ లెక్కించారు. ఇక ఆ వీడియో తీస్తున్న సమయంలో తాను ప్రమాదవశాత్తు కిందపడటంతో మోకాలికి గాయం కూడా అయిందని చెప్పారు. ఈ దారుణమైన రోడ్డుపైనే నిత్యం స్కూల్ బస్సులు వెళ్లడం చూసి ఆమె తీవ్రంగా చలించిపోయారు. ఇంతటి ప్రమాదకరమైన రోడ్లపై చిన్న పిల్లలను స్కూల్‌కు పంపుతూ.. వారి ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నందుకు బాధగా ఉందని ఆమె పేర్కొన్నారు.


అదే సమయంలో రోజూ మనం ఇంట్లో ఉండి బుక్ చేసుకుంటే.. 10 నిమిషాల్లోనే ఆర్డర్స్ డెలివరీ చేసే ఏజెంట్లు కూడా ఈ గుంతలమయమైన రోడ్డుపైనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వర్తూర్ మెయిన్ రోడ్డుపై కనీసం వీధి దీపాలు కూడా లేవని.. వర్షం పడితే ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి అంటూ తెలిపారు. ఇక ఈ రోడ్డు పట్ల అధికారులు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. మీకు సాహసాలు చేయాలని.. లేదా ఆఫ్‌రోడింగ్ డ్రైవింగ్ ఇష్టమైతే.. ఈ రోడ్డు మీ కోసమే అంటూ జైషా అమ్లాని సెటైర్లు వేశారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులకు జవాబుదారీతనం కోరాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పేర్కొన్నారు.


ఇక జైషా అమ్లాని పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో.. నెటిజన్లు కర్ణాటక ప్రభుత్వంపై, రాజకీయ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉండే తమ కంపెనీల ఉద్యోగులు బెంగళూరు నగరాన్ని సందర్శించి.. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా పరిస్థితిని చూసినప్పుడు చాలా సిగ్గుగా అనిపిస్తుందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఈ రోడ్లపై గర్భిణీలు ప్రయాణించడం చాలా ప్రమాదకరమని.. ట్రాఫిక్ కూడా ఇబ్బంది పెడుతోందని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు. తాము రోడ్డు పన్నులు అధికంగా చెల్లిస్తున్నప్పటికీ.. ఈ ప్రమాదాలు ఎదురవుతున్నాయని.. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. బెంగళూరు నగర మౌలిక సదుపాయాలపై బయోకాన్ అధినేత కిరణ్ మజుందార్ షా ఇటీవల చేసిన విమర్శలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించిన కొన్ని రోజులకే ఈ వీడియో బయటికి రావడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa