'మేకిన్ ఇండియా' కార్యక్రమానికి భారీ ఊతమిస్తూ, భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఒక చారిత్రక ముందడుగు వేసింది. ప్రయాణికుల విమానాల తయారీ కోసం రష్యాకు చెందిన పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ (పీజేఎస్సీ-యూఏసీ)తో కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, ఎస్జే-100 (SJ-100) సివిల్ కమ్యూటర్ విమానాలను భారత్లో తయారు చేయనున్నారు. మంగళవారం రష్యా రాజధాని మాస్కోలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.ఈ కార్యక్రమానికి హెచ్ఏఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డీకే సునీల్, పీజేఎస్సీ-యూఏసీ డైరెక్టర్ జనరల్ వాదిమ్ బదేకా హాజరయ్యారు. వారి సమక్షంలో హెచ్ఏఎల్ తరఫున ప్రభాత్ రంజన్, యూఏసీ తరఫున ఒలేగ్ బొగోమొలోవ్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ విషయాన్ని హెచ్ఏఎల్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమర్పించిన ఫైలింగ్లో అధికారికంగా ప్రకటించింది. మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో పూర్తిస్థాయి ప్రయాణికుల విమానాల తయారీ ప్రాజెక్టు పట్టాలెక్కనుండటం ఇదే ప్రథమం.ఎస్జే-100 అనేది రెండు ఇంజిన్లు కలిగిన ఒక నారో-బాడీ విమానం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 16 కమర్షియల్ ఎయిర్లైన్స్ సంస్థలు 200కు పైగా ఈ తరహా విమానాలను నడుపుతున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఎస్జే-100 విమానాలను తయారు చేసే హక్కులు హెచ్ఏఎల్కు లభిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకం కింద దేశీయంగా ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడంలో ఈ విమానాలు గేమ్ ఛేంజర్గా నిలుస్తాయని హెచ్ఏఎల్ విశ్వాసం వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa