ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం.. విమానం పక్కనుండగానే దగ్ధమైన బస్సు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 07:34 PM

దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. విమానాశ్రయంs మూడవ టెర్మినల్ వద్ద నిలిపి ఉంచిన ఒక సర్వీస్ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన జరిగినప్పుడు ఆ బస్సు, ట్యాక్సీయింగ్ ఏరియాలో ఉన్న ఎయిర్ ఇండియా విమానానికి అత్యంత సమీపంలో ఉండటం తీవ్ర ఆందోళన కల్గించింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎవరికైనా ఏమైనా అయిందా అంటూ నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. అది గుర్తించిన అధికారులు ఎవరికీ ఏమీ కాలేదని అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. మరి ఆ బస్సులో మంటలు ఎలా అంటుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


బస్సులో మంటలు చెలరేగడాన్ని వెంటనే గుర్తించిన విమానాశ్రయ భద్రతా సిబ్బంది, అగ్నిమాపక బృందాలు తక్షణమే స్పందించాయి. వారు చురుకుగా వ్యవహరించి, మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైనప్పటికీ.. బస్సు సమీపంలో నిలిపి ఉంచిన ఎయిర్ ఇండియా విమానానికి ఎలాంటి నష్టం జరగలేదని అధికారిక వర్గాలు ధృవీకరించాయి.


అలాగే విమానంలో ఉన్న సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. అలాగే ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. బస్సులో షార్ట్ సర్క్యూట్ సంభవించడమే ఈ అగ్నిప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై విమానాశ్రయ ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ప్రమాదం ఎలా జరిగింది, భద్రతా నియమాలు సరిగా పాటించారా లేదా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa