టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. అతడు ప్రస్తుతం భారత్ తరఫున కేవలం వన్డేలో మాత్రమే ఆడుతున్నాడు. 36 ఏళ్ల విరాట్.. వన్డే ప్రపంచకప్ 2027 ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లీ.. మూడో మ్యాచులో మాత్రం సత్తాచాటాడు. 74 పరుగులతో అజేయంగా నిలిచి.. తనలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందని నిరూపించాడు.
ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ తర్వాత ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీకి మంచి స్నేహితుడైన అతడు.. విరాట్ అంతర్జాతీయ క్రికెట్ ఎప్పటివరకు ఆడతాడో అంచనా వేశాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
"నాకు తెలిసినంత వరకు విరాట్ కోహ్లీ మరో ఐదేళ్ల పాటు క్రికెట్ ఆడతాడని అనుకుంటున్నా. అతడికి ఆ సత్తా ఉంది. నా అభిప్రాయం ప్రకారం అతడు వన్డే ప్రపంచకప్ 2027 తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడు. అయితే ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మరో మూడు, నాలుగేళ్లు ఆడతాడు. కుదిరితే ఐదేళ్ల పాటు అతడు ఐపీఎల్ ఆడతాడు. కానీ ఐపీఎల్ కంటే కూడా వన్డే ప్రపంచకప్ ప్రిపరేషన్ కోసం అతడు ఎక్కువ టైమ్ కేటాయించాల్సి రావొచ్చు" అని ఏబీడీ అభిప్రాయపడ్డాడు.
ఇదే సమయంలో విరాట్ తుది జట్టులో ఉంటే.. అప్పుడు టీమ్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో కూడా చెప్పుకొచ్చాడు. "జట్టులో విరాట్ కోహ్లీ ఉన్నాడంటే చాలు.. మిగతా ఆటగాళ్ల ఆటతీరు మారిపోతుంది. ముఖ్యంగా జట్టులోని యువ ఆటగాళ్లలో అతడు ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రోహిత్ శర్మ కూడా ఇదే కోవకు చెందుతాడు. వీరిద్దరూ జట్టులో ఉంటే చాలు. వారు కొన్ని సార్లు బ్యాట్తో రాణించకపోయినా.. జట్టులో తమదైన ముద్ర వేస్తారు" అని ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa