ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌‌కు వస్తోన్న రష్యా ఆయిల్ ట్యాంకర్‌ నౌక మార్గమధ్యలో వెనక్కి

international |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 09:28 PM

రష్యా చమురు కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన తాజా ఆంక్షలు ప్రభావం మొదలైంది. రష్యా నుంచి భారత్‌కు ఆయిల్ సరఫరాలో అంతరాయం స్ఫష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత రిఫైనరీల నుంచి రష్యా సంస్థలకు కొత్త ఆర్డర్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా, మాస్కో నుంచి క్రూడాయిల్‌తో భారత్‌‌కు బయలుదేరిన ట్యాంకర్ నౌక ది ఫ్యూరియా మార్గమధ్యలో వెనక్కి మళ్లింది. అనంతరం కొద్దిదూరం వెళ్లి బాల్టిక్ సముద్రంలో నిలిచిపోయింది. షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ డేటా ప్రకారం.. డెన్మార్క్‌, జర్మనీ మధ్య జలసంధిలో పశ్చిమ దిశగా వెళ్తున్న ఒక నౌక అక్టోబరు 28న (మంగళవారం) యూటర్న్ తీసుకుని, కొంతదూరం వెళ్లాక నెమ్మదించింది అఫ్రామాక్స్ రోస్నెఫ్ట్ పిజెఎస్సీ విక్రయించిన క్రూడాయిల్‌ను అది తీసుకొస్తోంది.


రష్యాలోని ఉరల్స్ చమురు కంపెనీ నుంచి ది ఫ్యూరియా దాదాపు 7,30,00 బ్యారెళ్ల క్రూడాయిల్‌ నింపుకుని అక్టోబరు 20న భారత్‌కు బయలుదేరింది. ఆ నౌక రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రభుత్వ రంగ రిఫైనరీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్  ఉపయోగించే గుజరాత్‌లోని సిక్కా పోర్టుకు నవంబర్ మధ్యలో అక్కడికి చేరుకుంటుందని డేటా తెలిపింది. అయితే, తర్వాత దాని షెడ్యూల్‌ను ఈజిప్టు పోర్టుకు చేరుకునేలా మార్పులు చేసినట్టు పేర్కొంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు మాటిచ్చినట్టు ట్రంప్ ఇటీవల ప్రకటించారు.


ఇదిలా ఉండగా, హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌, మిట్టల్ గ్రూప్‌ భాగస్వామ్యంలో నడిచే హెచ్‌ఈఎంఎల్  రిఫైనరీ రష్యా ముడిచమురును కొనుగోలు చేసింది. ఆర్సెలార్‌ మిట్టల్‌కు చెందిన ఈ రిఫైనరీ ఆంక్షల పరిధిలో ఉన్న నౌకల ద్వారా క్రూడాయిల్‌ను గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు దిగుమతి చేసుకుంటుంది. అక్కడ నుంచి పంజాబ్‌లోని గురుగోవింద్‌ సింగ్ రిఫైనరీకి పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక నివేదించింది. దేశంలో పదో అతిపెద్ద రిఫైనరీ అయిన ఇది. ఏడాదికి 11.3 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌ను శుద్ధిచేస్తుంది.


‘‘జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో రష్యాలోని ముర్మాన్స్క్‌లోని ఆర్కిటిక్ నౌకాశ్రయం నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్ వరకు అమెరికా ఆంక్షల పరిధిలోని ఉన్న నౌకల్లో ఆయిల్ రవాణా అయింది. దీనిని కప్పిపుచ్చుకునేందుకు మోసపూరిత చర్యలకు దిగుతున్నాయి’’ అని ఆ కథనం తెలిపింది. షిప్పింగ్ డేటా, కస్టమ్స్ రికార్డులు, ఉపగ్రహ ఫోటోల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నౌకలను ఎవరు ఏర్పాటుచేశారనేది మాత్రం తెలియరాలేదని పేర్కొంది..


ఉక్రెయిన్ యుద్ధం విషయంలో వ్లాదిమిర్ పుతిన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రష్యా ఆయిల్ కంపెనీలు రాస్‌నెఫ్ట్, లుకాయిల్‌, వాటి అనుబంధ సంస్థల నుంచి అమెరికా కంపెనీలు, ఇతర వ్యక్తులు ఆయిల్ దిగుమతులపై అక్టోబరు 22న అగ్రరాజ్యం, యూరోపియన్ యూనియన్‌లు నిషేధం విధించాయి. ఆంక్షలను అతిక్రమించి ఎవరైనా కొనుగోలు చేస్తే పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. రష్యా చమురు కంపెనీలతో లావాదేవీలను నవంబర్‌ 21 నాటికి ముగించాలని ఆయన తేల్చిచెప్పారు. ప్రస్తుతం భారత క్రూడాయిల్ దిగుమతుల్లో మూడో వంతు రష్యా నుంచే సరఫరా అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa