ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతాంగ సమస్యలపై ప్రత్యక్ష పోరుకు సిద్దమౌతాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 12:02 PM

కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ సమస్యలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్నట్లు వైయస్ఆర్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం వైయస్ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ సీజన్‌ ప్రారంభమై నెల గడిచినా రైతులకు సబ్సిడీతో పప్పుశనగ విత్తనాలు పంపిణీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విత్తనాలు, ఎరువులు కూడా సకాలంలో అందడం లేదని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చాక రెండు ఖరీఫ్, ఒక రబీ సీజన్‌ ముగిసిందని.. ఇప్పుడు మరో రబీ సీజన్‌ ప్రారంభమైందన్నారు. ప్రతి సీజన్‌లోనూ రైతులు నిరాదరణకు గురవుతున్నారని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు వర్షాభావంతో దెబ్బతిన్నాయన్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో వేరుశనగ సాధారణ సాగు 4.50 లక్షల ఎకరాలు ఉంటే 2.25 లక్షల ఎకరాల్లోనే సాగు చేసిన పరిస్థితి ఉందని తెలిపారు. ఇప్పుడు పంటకు తెగుళ్లు వ్యాపిస్తున్నాయని, ఫలితంగా దిగుబడులు కూడా రాలేని పరిస్థితి ఉందన్నారు. జిల్లాలో రబీ సీజన్‌లో పప్పుశనగ సాగు 70 వేల హెక్టార్లలో ఉంటుందని, సీజన్‌ ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇంకా విత్తనాలు పంపిణీ చేయలేదన్నారు. తీరిగ్గా ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ ప్రారంభించామని అధికారులు ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 40 శాతం సబ్సిడీతో పప్పుశనగ విత్తనాలు అందిస్తే.. నేడు 25 శాతానికి కుదించారని తెలిపారు. గత ఏడాది జిల్లాకు 27 వేల క్వింటాళ్ల పప్పుశనగ కేటాయిస్తే ఈ ఏడాది కేవలం 14 వేల క్వింటాళ్లు మాత్రమే కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఒక్క ప్రజాప్రతినిధి కూడా అడిగిన పాపానపోలేదన్నారు. ఇటీవల నిర్వహించిన డీఆర్‌సీ సమావేశంలో ప్రత్యామ్నాయ విత్తనాలు పంపిణీ చేస్తామని సాక్షాత్తూ మంత్రి పయ్యావుల కేశవ్‌ చెప్పినా ఇంత వరకు అతీగతీ లేదన్నారు. గిట్టుబాటు ధరలు లేకపోతే గతంతో టమోటా పంటను మాత్రమే రైతులు పారేసిన ఘటనలు చూశామని, కానీ నేడు అరటి, చీనీ, మామిడి పంటలను కూడా రోడ్డుపై పడేస్తున్నారన్నారు. మొక్కజొన్న పంట సాగు సమయంలో ధర ఉన్నా చేతికొచ్చిన సమయంలో ఉండడం లేదన్నారు. ఇటీవలి వరకు క్వింటా మొక్కజొన్న రూ.2800 ఉంటే ఇప్పుడు రూ.1800కి పడిపోయిందన్నారు. ఓ వైపు దిగుబడి రాక.. మరోవైపు గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. గిట్టుబాటు ధర కోసం అధికార పార్టీకి చెందిన రాయదుర్గం ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాసే పరిస్థితి ఉందంటో ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? అని అన్నారు. ప్రజాప్రతినిధులు తమ ఆదాయం కోసం చేసే ఆలోచన రైతుల గురించి చేయడం లేదన్నారు. అధికారులు కూడా ప్రజాప్రతినిధుల మెప్పుపొందడం కోసం మాత్రమే పని చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నరగా రైతుల పరిస్థితి చూస్తుంటే గతంలోలా వలసలు, రైతుల బలవన్మరణాలు ఎక్కడ జరుగుతాయోనన్న ఆందోళన కలుగుతోందని ఆవేదన చెందారు. వైయస్ఆర్ సీపీ హయాంలో పంట నష్టపోతే ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ వచ్చేదని.. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa