ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత మహిళల జట్టు విజయం అద్భుతం

sports |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 04:09 PM

మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టుపై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత మహిళల జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని, ఈసారి ప్రపంచకప్ ట్రోఫీ కచ్చితంగా భారత్‌కే దక్కుతుందని జోస్యం చెప్పాడు.సెమీఫైనల్లో ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన బలమైన ఆస్ట్రేలియాపై భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి, 2005, 2017 తర్వాత మూడోసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ ఛేదన కావడం విశేషం. జెమీమా రోడ్రిగ్స్ (134 బంతుల్లో 127) అద్భుత సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ విజయంపై కనేరియా మాట్లాడుతూ... "ఇది అద్భుతమైన విజయం. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే, ట్రోఫీ కచ్చితంగా భారత్‌కే వెళుతుంది. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై గెలవడం ఫైనల్‌కు ముందు వారికి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది" అని అన్నాడు. జెమీమా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిందని, చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును గెలిపించిందని క‌నేరియా కొనియాడాడు. "భారత మహిళల జట్టు చాలా బలంగా ఆడుతోంది. వారి ఫిట్‌నెస్ స్థాయులు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఇది భారత మహిళల క్రికెట్‌లో ఒక సానుకూల ధోరణికి నాంది పలికింది. భవిష్యత్ తరాలకు ఇది మంచి సంకేతం" అని కనేరియా పేర్కొన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa