ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిగ్రీ విద్యార్థి బలవన్మరణం.. మహిళా లెక్చరర్‌పై ఆరోపణలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 07:00 PM

విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ఎంవీపీ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాయితేజ అనే డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సాయితేజ స్థానికంగా ఉన్న ఓ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. అయితే సాయితేజ ఆత్మహత్యకు వేధింపులే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీలోని మహిళా లెక్చరర్ వేధింపులతోనే సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని కుటుంబసభ్యులు, అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. సాయితేజకు, మహిళా లెక్చరర్‌కు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్‌ కూడా బయటపెట్టారు.


అయితే ఈ వ్యవహారంలో మరో మహిళా లెక్చరర్ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. మహిళా లెక్చరర్ వేధింపులు, మానసిక వేధింపుల కారణంగానే సాయితేజ బలవన్మరణానికి పాల్పడ్డాడని అతని కుటుంబం ఆరోపిస్తోంది. కొద్ది రోజులుగా వేధింపులు ఎక్కువ కావటంతో.. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు.


ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం సమయంలో కాలేజీ వద్దకు చేరుకుని సాయితేజ కుటుంబసభ్యులు, స్నేహితులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు విద్యార్థి సంఘాలు కూడా తోడవటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. సాయితేజ మరణానికి కారణమైన వారిని శిక్షించాలంటూ విద్యార్థి కుటుంబసభ్యులు, తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆందోళన నిర్వహించారు. కాలేజీ ప్రిన్సిపల్‌కు ఈ వ్యవహారం మీద ఫిర్యాదు చేశారు. మరోవైపు సాయితేజ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అతని కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసినట్లు తెలిసింది.


మరోవైపు ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా లెక్చరర్ వాదన మరోలా ఉంది. సాయితేజను తాను కొడుకులా చూశానని ఆమె చెప్తున్నారు. అలాంటిది ఇలా ఆరోపణలు రావటం ఏమిటని వాపోతున్నారు. ఇక వాట్సాప్ చాటింగ్‌లోనూ మహిళా లెక్చరర్ భర్తను బాబాయ్ అంటూ సాయితేజ పేర్కొనటం ఆసక్తికరంగా మారింది. అయితే సాయితేజ స్నేహితుల వాదన మరోలా ఉంది. సాయితేజకు మహిళా లెక్చరర్ ఫోన్ చేసిన సమయంలో తాము పక్కనే ఉన్నామని.. తనను బయటకు తీసుకెళ్లమని, తనతోనే మాట్లాడాలంటూ ఒత్తిడి చేసేదని చెప్తున్నారు.. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa