శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ, పోలీసులతో మాట్లాడిన హోం మంత్రి అనిత.. తొక్కిసలాటపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి.. మెరుగైన చికిత్సను అందించాలని అనిత.. అధికారులను ఆదేశించారు. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రతివారం 1500 నుంచి 2000 మంది భక్తులు వస్తుంటారని హోం మంత్రి అనిత తెలిపారు. ఆలయం మొదటి అంతస్తులో ఉంటుందని.. 20 మెట్లు ఎక్కిన తర్వాత మొదటి అంతస్తులోకి వెళ్లాలని చెప్పారు.
అయితే పైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కే క్రమంలో రెయిలింగ్ ఊడిపడటంతో ఈ దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నట్లు మంత్రి వివరించారు. రెయిలింగ్ ఊడిపడటంతో భక్తులు ఒకరిమీద ఒకరు పడి తొక్కిసలాట జరిగినట్లు హోం మంత్రి అనిత పేర్కొన్నారు. భక్తులు చనిపోవటం బాధాకరమని అన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మరోవైపు కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయానికి.. దేవాదాయ శాఖకు సంబంధం లేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయం పూర్తిగా ప్రైవేటు వ్యక్తులదని చెప్పారు. ఓ వ్యక్తి తన సొంత నిధులతో ఆలయం నిర్మించారని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.ఆలయాల్లో ఇక నుంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట మూలంగా భక్తులు మృతి చెందడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఈ ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆలయాల్లో క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని.. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తుతోపాటు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa