శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పెను విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట పలు కుటుంబాలలో తీరని వేదనను మిగిల్చింది. పవిత్ర కార్తీక ఏకాదశి పర్వదినం రోజున శ్రీవారిని దర్శించుకోవడానికి పిల్లాపాపలతో వచ్చిన భక్తులు.. అనుకోకుండా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయి విగత జీవులుగా మారారు. దీంతో వారి బంధువుల ఆక్రందనలు మిన్నంటాయి. అయితే ఏకాదశి కావటంతో ఊహించిన దానికంటే ఎక్కువ మంది భక్తులు ఆలయానికి రావటమే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం భక్తుల రద్దీ, భక్తుల నిర్వహణ సరిగా లేకపోవడం, అలాగే ఆలయానికి అధికారిక అనుమతులు లేకపోవడం ఈ విషాదానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
ఏకాదశి పర్వదినం కావటంతో కాశీబుగ్గ, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం వంటి ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావటం, వారిని అదుపు చేయలేకపోవటంతో ఆలయ ప్రవేశ మార్గం వద్ద ఉదయం 11 గంటల 45 నిమిషాల సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలిసింది. ఫలితంగా రెయిలింగ్ విరిగిపడటంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో పలువురు భక్తులు చనిపోయారు. మరోవైపు ఆలయంలోకి ప్రవేశించే మార్గంతో పాటుగా దర్శనం అనంతరం బయటకు వచ్చే దారి కూడా ఒకటే కావటంతో ప్రవేశద్వారం వద్ద రద్దీ ఎక్కువైనట్లు తెలిసింది.
మరోవైపు కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయం ఓ ప్రైవేట్ ఆలయం. ఇది ఏపీ దేవాదాయ శాఖ కింద నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తి తన సొంత డబ్బులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయం వద్ద ఈ స్థాయిలో భక్తులకు దర్శనాలు కల్పించేందుకు నిర్వాహకులు ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. అలాగే ఈ కార్యక్రమం గురించి ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందించలేదు. అయితే సాధారణంగా ఆలయానికి రెండు వేల మంది భక్తులు వస్తుంటారని.. ఇంత పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని ఊహించలేకపోయామని ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా తెలిపారు. ఈ కారణంగానే పోలీసులకు సమాచారం అందించలేకపోయామని చెప్పారు. ఈ నేపథ్యంలో భక్తుల నిర్వహణ సరిగా లేకపోవటం, భద్రతా ప్రణాళిక లేకపోవడం, కొనసాగుతున్న నిర్మాణం, ఆలయానికి అధికారిక అనుమతి లేకపోవడం వంటి కారణాలన్నీ కలిసి ఈ పెను విషాదానికి కారణమయ్యాయని అధికారులు చెప్తున్నారు.
కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆలయానికి శనివారం రోజున 15 వేల మంది భక్తులు వచ్చారని తెలిపింది. రెయిలింగ్ ఊడి పడిన కారణంగా తొక్కిసలాట జరిగిందని.. ఈ తొక్కిసలాట కారణంగా ఘటనాస్థలంలో ఏడు మంది, పలాస ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఇద్దరు చనిపోయినట్లు తెలిపింది. ఈ ఘటనలో 13 మందికి గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa