ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైనారిటీ యువతకు.. పోలీస్ , టీచర్ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 07:50 PM

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న మైనారిటీ యువతకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తోంది. టెట్, డీఎస్సీ వంటి వాటితో పాటుగా ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలకు కూడా ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు ఈ ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ విషయాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ కర్నూలు జిల్లా ఆఫీసర్ సబిహా పర్వీన్‌ వెల్లడించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ముస్లింలు, దూదేకులతో పాటుగా మైనారిటీ వర్గాలైన క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పారశీకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు apcedmmwd.org వెబ్‌సైట్ సంప్రదించి.. దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే ఏవైనా వివరాల కావాలంటే 0866 2970567 నంబరుకు సంప్రదించాలని సూచించారు.


మరోవైపు ప్రకాశం జిల్లాలోనూ మైనారిటీ సంక్షేమ శాఖ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. సెంటర్‌ పర్‌ ఎడ్యుకేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ మైనారిటీస్‌ సంస్థ ఉచిత శిక్షణ అందిస్తోంది. మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ పోటీ పరీక్షలతో పాటుగా టెట్‌, డీఎస్సీ వంటి పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తోంది. మైనార్టీస్‌ ఫైనాన్సు కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ హైఫా శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు.


ఆసక్తి కలిగిన మైనారిటీ యువత.. తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ పోర్టల్‌ https://apcedmmwd.org/ సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆఫ్‌లైన్‌ ద్వారా, ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తారని వివరించారు. ఇతర వివరాలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మైనారిటీస్‌ ఫైనాన్సు కార్పొరేషన్‌, ఒంగోలు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 0866–2970567, 9849901157, 9951160149 ను సంప్రదించాలని సూచించారు.


మరోవైపు మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత శిక్షణ ద్వారా మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉచితంగా కోచింగ్‌తో పాటుగా పరీక్షలకు కావాల్సిన స్టడీ మెటీరియల్‌ను అందించనున్నారు. సరైన శిక్షణ, ప్రోత్సాహం అందించిన వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని మైనారిటీ విద్యాభివృద్ధి కేంద్రం (CEDM) ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో ఇప్పటికే నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మైనారిటీ సంక్షేమ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa