శబరిమలలో త్వరలోనే మండల, మకర విళక్కు పూజలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులు.. శబరిమల దర్శనం కోసం టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 1వ తేదీ నుంచి వర్చువల్ క్యూ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అయితే ఇప్పటివరకు దర్శన టికెట్లు ఉచితంగా.. బుక్ చేసుకునేవారు. కానీ ఈసారి నుంచి ఒక్కో స్లాట్ బుకింగ్ కోసం రూ.5 వసూలు చేస్తున్నారు. దీనిపై శబరిమల అయ్యప్ప ఆలయ వ్యవహారాలు చూసుకునే.. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ప్రతి భక్తుడు ఒక్కో స్లాట్ బుకింగ్కు అదనంగా రూ.5 చొప్పున వెల్ఫేర్ ఫండ్ చెల్లించాల్సి ఉంటుంది.
శబరిమలకు వచ్చే భక్తులకు ఎప్పుడైనా ప్రమాదాలు లేదా విషాద ఘటనలు జరిగినప్పుడు సహాయం అందించడానికి ఒక నిధిని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో టీడీపీ ఈ వెల్ఫేర్ ఫండ్ను తెరపైకి తీసుకువచ్చినట్లు తెలిపింది. 2011 పుల్లుమేడు తొక్కిసలాట ఘటన తర్వాత.. శబరిమలకు వచ్చే యాత్రికులకు సహాయం అందించడానికి ఒక నిధిని ఏర్పాటు చేయాలని కేరళ హైకోర్టు గతంలోనే ఆదేశించిన విషయాన్ని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు.
హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న భక్తులకు ఈ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని వివరించారు. ఈ విషయంలో సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. 2017లోనే కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు టీడీబీ కమిషనర్ పేరుతో ప్రత్యేక అకౌంట్ తెరిచేందుకు ఉత్తర్వులు జారీ అయినప్పటికీ.. అప్పట్లో అమల్లోకి తీసుకురాలేదు.
ఈ వెల్ఫేర్ ఫండ్ను ముఖ్యంగా కొండపైకి వెళ్లేటప్పుడు ఆరోగ్య సమస్యల కారణంగా మరణించిన భక్తుల కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి ఉపయోగించాలని టీడీబీ యోచిస్తోంది. గతేడాది మండల, మకర విళక్కు సీజన్లోనే 30 మందికి పైగా భక్తులు కొండపైకి వెళ్లేటప్పుడు గుండెపోటుతో మరణించారు. గుండె సమస్యలు ఉన్నవారు ట్రెక్కింగ్ చేయకూడదని విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. ప్రతీ సీజన్లోనూ మరణాలు జరుగుతూనే ఉన్నాయని అధికారులు తెలిపారు.
మరోవైపు.. శబరిమల మండల, మకర విళక్కు పూజల కోసం వెళ్లేవారి కోసం శనివారం సాయంత్రం వర్చువల్ క్యూ బుకింగ్ ప్రారంభం అయ్యాయి. వేల సంఖ్యలో భక్తులు ఒకేసారి స్లాట్ బుకింగ్కు ప్రయత్నించడంతో పేమెంట్ గేట్వేలో సమస్యలు తలెత్తినట్లు టీడీబీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 20వ తేదీ ముగిసిన వార్షిక యాత్ర సీజన్లో 53.99 లక్షల మంది భక్తులు శబరిమల అయ్యప్పను సందర్శించారు. వీరిలో 80 శాతానికి పైగా భక్తులు వర్చువల్ క్యూ వ్యవస్థను ఉపయోగించడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa