ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కత్తితో ప్రయాణికులను పొడిచిన దుండగులు.. రైలు అంతా రక్తమే

international |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 08:26 PM

ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో వరసగా కత్తి దాడులకు సంబంధించిన నేరాలు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ.. ఈ కత్తి దాడులు పెరగడంపై ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిని దేశ ప్రధాని కీర్ స్టార్మర్ జాతీయ సంక్షోభంగా అభివర్ణించారు. తాజాగా మరో భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. డాన్‌కాస్టర్ నుంచి లండన్ కింగ్స్ క్రాస్‌కు వెళ్తున్న రైలులో.. కత్తులతో దుండగులు విరుచుకుపడ్డారు. ఇష్టమొచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది గాయపడగా.. 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


 గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించినట్లు కేంబ్రిడ్జ్‌షైర్ పోలీసులు. ఈ ఘటన శనివారం (నవంబర్ 1) సాయంత్రం 7:39 గంటల సమయంలో జరిగినట్లు తెలిపారు. రైలులో ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక పొడవైన కత్తిని పట్టుకున్న వ్యక్తిని తాను చూసినట్లు చెప్పారు. ఆ సమయంలో రైలు బోగీ అంతా తనకు రక్తం కనిపించిందని.. ప్రయాణికులు భయంతో టాయిలెట్‌లలోకి వెళ్లి దాక్కున్నారని చెప్పారు. రైలు ఆగిన తర్వాత ప్లాట్‌ఫారమ్‌పై ఒక వ్యక్తి పెద్ద కత్తిని పట్టుకుని ఉన్నాడని.. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తాను చూశామని వెల్లడించారు.


రైలులో ఇద్దరు వ్యక్తులు కత్తులతో ఇష్టమొచ్చిన వారిని విచక్షణా రహితంగా పొడిచారు. దీంతో రైలు కంపార్ట్‌మెంట్లలో పెద్ద ఎత్తున ఆర్తనాదాలు, అరుపులు వినిపించాయి. అనంతరం ఓ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే కేంబ్రిడ్జ్‌షైర్ పోలీసులు స్పందించి.. హంటింగ్‌డన్ స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసులు (బీటీపీ) ‘ఎక్స్‌’లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఉగ్రవాద నిరోధక విభాగాలు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రాథమిక విచారణ వేగంగా జరుగుతున్నట్లు.. నిందితుల ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవడానికి సమయం పడుతుందన్నారు.


యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, హోం సెక్రటరీ షబానా మహమూద్ ఈ ఘటనను భయంకరమైనది పేర్కొన్నారు. ఈ దుర్ఘటన గురించి తెలిసి చాలా బాధపడ్డట్లు తెలిపారు. ఈ చర్యను ఖండిస్తున్నట్లు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాను. బాధితులకు సానుభూతి తెలిపిన స్టార్మర్.. ప్రజలు పోలీసుల సూచనలను పూర్తిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ఘటనతో తాను తీవ్రంగా కలత చెందినట్లు హోం సెక్రటరీ షబానా మహమూద్ చెప్పారు. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని.. ఎవరూ పుకార్లు నమ్మవద్దని సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa