ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిత్యం నరకమే, పరిహారం సరిపోలేదు.. విమాన ప్రమాదంలో బతికిన ఏకైక వ్యక్తి వేదన!

national |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 08:12 PM

ఈ ఏడాది జూన్ 12వ తేదీన గుజరాత్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం.. దేశం మొత్తం మాత్రమే కాకుండా ఇతర దేశాల్లోనూ తీవ్ర విషాద ఛాయలను నింపింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘోర ఎయిరిండియా విమాన ప్రమాదంలో విమానంలోని 241 మందితోపాటు.. అది కూలిన మెడికల్ కాలేజీలో మరో 19 సహా మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ విమానంలోని 11ఏ సీటులో ప్రయాణిస్తున్న ఒకే ఒక వ్యక్తి 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ ప్రమాదం తర్వాత అతని మానసిక, శారీరక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజాగా ఆ ఘటనను విశ్వాస్ కుమార్ రమేష్ గుర్తు చేసుకున్నారు.


ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క వ్యక్తిని తానే అని.. అయినా ఇంకా నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. ఇది నిజంగా ఒక అద్భుతమని తెలిపారు. అయితే తనకు వెన్నెముక లాంటి తన తమ్ముడిని ఈ ఘటనలో కోల్పోయానని తనలో ఉన్న బాధను వ్యక్తం చేశారు. అయితే ఈ ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినప్పటికీ.. లండన్‌లోని లీసెస్టర్‌లో ఉన్న రమేష్‌కు ఆ భయంకర జ్ఞాపకాలు నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ప్రపంచం అంతా తనను అదృష్టవంతుడిని అని అంటున్నప్పటికీ.. తనకు మాత్రం ఈ లైఫ్ శాంతి లేని నరకంగా మారిందని పేర్కొంటున్నారు.


తాను ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నానని.. ఒక గదిలో కూర్చొని ఎవరితో మాట్లాడకుండా ఉంటానని విశ్వాస్ కుమార్ రమేష్ చెప్పారు. తన భార్య, కొడుకు, కనీసం తల్లితో కూడా మాట్లాడటం లేదని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తాను సరిగా నడవలేనని.. మెల్లిగా నడుస్తున్నప్పుడు తన భార్య సహాయం చేస్తుందని వివరించారు. అతని తల్లి కూడా నాలుగు నెలలుగా ఎవరితో మాట్లాడకుండా కూర్చుంటున్నారని తెలిపారు.


ఇక విశ్వాస్ కుమార్ రమేష్.. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని అతని సన్నిహితులు పేర్కొంటున్నారు. శారీరక నొప్పితో పాటు తీవ్ర మానసిక ఆందోళనతో ఆయన బాధపడుతున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం టాటా గ్రూప్ ఆధీనంలో ఉన్న ఎయిరిండియా.. విశ్వాస్ కుమార్ రమేష్‌కు మధ్యంతర పరిహారంగా 21,500 బ్రిటన్ పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ.22 లక్షలు) అందించింది. అయితే.. అతని సలహాదారులు మాత్రం ఈ పరిహారం ఎంతమాత్రం సరిపోదని పేర్కొంటున్నారు.


జూన్ 12వ తేదీన అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఇంజిన్‌లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్ల విద్యుత్ కోల్పోయి విమానం అదుపు తప్పి బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత.. పొగ దట్టంగా వ్యాపిస్తున్న శిథిలాల నుంచి రమేష్ నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి.


విమానంలో ఎమర్జెన్సీ డోర్ వద్ద.. 11ఏ సీటులో కూర్చోవడం వల్లే తాను బతికి బయటపడ్డానని చెప్పారు. అయితే ఆయనకు కొద్ది సీట్ల దూరంలో ఉన్న అతని తమ్ముడు అజయ్ మాత్రం ఈ ప్రమాదంలో మరణించారు. ప్రమాదం జరిగిన తర్వాతి రోజు అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్ కుమార్ రమేష్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. తాను ఎలా బతికానో తెలియదని.. అదంతా చాలా వేగంగా జరిగిపోయిందని ఆ సమయంలో ఆయన ప్రధాని మోదీకి వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa