ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లుడు ఒప్పుకోకపోవడంతో దారుణం..!

Crime |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 09:00 PM

ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీ, ముత్తగూడెం గ్రామం సోమవారం ఉదయం భారీ కుటుంబ కలహాలు, హత్య వంటి విషాదానికి వేదికైంది. విడాకులకు సంబంధించిన మనస్పర్థలు రక్తపాతం వరకు దారితీశాయి. ముత్తగూడెం గ్రామానికి చెందిన గునిగంటి మహేష్ కు, అదే గ్రామానికి చెందిన మొటపోతుల వెంకన్న కుమార్తె అఖిలతో మూడు సంవత్సరాల క్రితం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే, గత ఒక సంవత్సరం నుంచి వీరిద్దరి మధ్య గొడవలు తరచూ జరుగుతుండటంతో మనస్పర్థలు తీవ్రమయ్యాయి. పెద్దమనుషులు పలుమార్లు పంచాయితీ చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.


దీంతో మహేష్ కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ విడాకుల ప్రక్రియే ఈ ఘోరానికి కారణంగా మారింది. విడాకులు తీసుకున్న నేపథ్యంలో.. అఖిల తండ్రి మొటపోతుల వెంకన్న, ఆమె సోదరుడు మనోజ్, వెంకన్న బావమరిది (అఖిల మేనమామ) అయిన యల్ది వెంకన్న సోమవారం ఉదయం మహేష్ ఇంటికి వచ్చారు. తమ కుమార్తె అఖిలను భార్యగా తిరిగి అంగీకరించాలని మహేష్‌ను కోరగా.. వారి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అక్కడి నుంచి వెనుదిరిగిన ముగ్గురు వ్యక్తులు (వెంకన్న, మనోజ్, యల్ది వెంకన్న), వెంటనే రెండు ద్విచక్ర వాహనాలపై కర్రలు, కల్లు గీసే కత్తులు వంటి పదునైన ఆయుధాలతో మహేష్ ఇంటికి తిరిగొచ్చి దాడికి పాల్పడ్డారు.


ఈ దాడిలో నిందితులు మహేష్‌ను కత్తితో కడుపులో, వెనుక భాగంలో పొడిచారు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న కుమారుడిని చూసి తల్లి నాగమణి (50) అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. ఆమెపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో నాగమణి అక్కడికక్కడే మరణించింది. స్థానికుల సహాయంతో తీవ్రంగా గాయపడిన మహేష్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


విషయం తెలుసుకున్న రూరల్ సీఐ ఎం. రాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులు మొటపోతుల వెంకన్న, మనోజ్, యల్ది వెంకన్నలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది. అయితే.. కావాలనే పథకం ప్రకారం హత్య చేసి పోలీసులకు లొంగిపోయారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగా జరిగిన ఈ హత్య గ్రామంలో విషాదాన్ని నింపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa