ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10 నిమిషాల ఆలస్యం వారి ప్రాణం తీసింది..!

Crime |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 09:09 PM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఈ దుర్ఘటనలో తాండూరు పట్టణం వడ్డెర గల్లీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. వడ్డెర గల్లీకి చెందిన ఎల్లయ్య గౌడ్ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు. ఆయనకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతి చెందిన వారిలో రెండవ కూతురు తనూష ఎంబీఏ చదువుతోంది, మూడో కూతురు సాయిప్రియ కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్, చిన్న కూతురు నందిని కూడా అదే కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు.


ఇటీవల గ్రామంలో ఓ పెళ్లికి హాజరైన వీరు.. ఆదివారం సెలవు కూడా ముగియడంతో తిరిగి హైదరాబాద్‌లోని తమ హాస్టల్‌కు బయలుదేరారు. తొలుత ట్రైన్‌లో వెళ్లాలని ప్రయత్నించగా.. 10 నిమిషాల ఆలస్యంతో ట్రైన్ మిస్ అయ్యింది. దీంతో తండ్రి ఎల్లయ్య గౌడ్ స్వయంగా వారిని తాండూరు ఆర్టీసీ బస్టాండ్‌లో దింపి.. హైదరాబాద్ బస్సు ఎక్కించారు. ఆ పది నిమిషాల ఆలస్యమే వారి ప్రాణాలు పోవటానికి కారణమైంది. వారిని బస్సు ఎక్కించిన కొద్ది నిమిషాల్లోనే ముగ్గురు కూతుళ్లు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఎల్లయ్య గౌడ్ పెద్ద కూతురు అనూష వివాహం అక్టోబర్ 17నే జరిగింది. పెళ్లి సంబరాల్లో ఆనందంగా గడిపిన క్షణాలు ఇంకా మరువకముందే.. ఈ ఘోర ప్రమాదం జరగడంతో కుటుంబమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆనందోత్సాహాలు నిండిన ఇల్లు ఒక్కసారిగా కన్నీరు, రోదనలతో నిండిపోయింది.


ఇక ఇప్పటి వరకు బస్సు ప్రమాదంలో 19 మంది మరణించినట్లు అధికార ప్రకటన వెలువడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మెుత్తం 70 మంది వరకు ప్రయాణికులు ఉండగా.. వారిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు చేవెళ్లతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జరిగిన ఘటనపై సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు విచారం వ్యక్తం చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలకు ఆదేశించారు. మృతుల కుటుంబాలని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa