ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలని కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వం హయాంలో అమరావతిలో ఆగిపోయిన పనులను పునరుద్ధరిస్తోంది. మరోవైపు, పూర్తిస్థాయి రాజధాని నిర్మాణం కోసం అవసరమయ్యే నిధుల సేకరణకు ప్రయత్నాలు చేస్తోంది. వివిధ ఆర్థిక సంస్థల నుంచి రూ. 32,500 కోట్ల నిధులు సేకరించేందుకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో కేవలం అమరావతి మాత్రమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళికలను రూపొదించడంలో ప్రజలను కూడా భాగస్వాములు కావాలని తాజాగా ప్రభుత్వం పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత 'విజన్ 2047' డాక్యుమెంట్ను రూపొందించడంలో మాతో చేరండి అని ప్రజలను ఆహ్వానించింది.
'విజన్ 2047' డాక్యుమెంట్ను రూపొందించడంపై ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) ఓ ప్రకటన చేసింది. అందులో.. ఏపీసీఆర్డీఏ ప్రపంచ స్థాయి రాజధాని ప్రాంతాన్ని నిర్మించేందుకు 'విజన్ 2047'ను రూపొందిస్తోందని తెలిపింది. విజన్ కార్యచరణలో భాగంగా, ప్రజలు, వివిధ భాగస్వాముల నుండి రాజధాని ప్రాంతీయ అభివృద్ది సంస్థ పరిధి కోసం ఆలోచనలు, సూచనలు, ప్రాధాన్యతలు, అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపింది. సీఆర్డీఏ ప్రాంతం సుమారు 8600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉందని తెలిపింది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రణాళికా ప్రాంతాలలో ఒకటని వెల్లడించింది. ఈ రాజధాని ప్రాంతంలో.. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని 56 మండలాలను ఉన్నాయని వివరించింది. విజయవాడ, గుంటూరు, అమరావతి, మంగళగిరి– తాడేపల్లి లాంటి నగరాలతో పాటు 900కు పైగా గ్రామాలు రాజధాని పరిధిలో ఉన్నాయని పేర్కొంది.
ఈ క్రమంలో ప్రజలు వెల్లడించే అభిప్రాయాలు.. ఏపీసీఆర్డీఏ బృహత్ప్రణాళిక (మాస్టర్ ప్లాన్ ), విజన్కు తోడ్పడతాయని సీఆర్డీఏ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఒక గూగుల్ ఫామ్ తయారు చేసింది. ఈ ఫామ్ నింపి సీఆర్డీఏ ప్రాంతం అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ప్రజలను కోరింది. కాగా, ఈ సర్వేలో భాగస్వాములు కావాలనుకునే వారు సీఆర్డీఏ వెబ్సైట్ (crda.ap.gov.in)లోకి వెళ్లి లింక్పై క్లిక్ చేయడం లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అభిప్రాయాలు తెలియజేయవచ్చు. గూగుల్ ఫామ్ ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది. ఇక్కడ అడిగిన ప్రశ్నలకు టిక్ మార్క్ పెట్టి ప్రజలు తమ అభిప్రాయాలు తెలపవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ వాసులు మాత్రమే కాకుండా.. విదేశాల్లో ఉన్నవారు.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా, ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa