అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణ్వాయుధాల శక్తి, అణు నిరాయుధీకరణపై ఫ్లోరిడాలోని మయామిలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరమ్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసి యావత్ ప్రపంచాన్ని తీవ్ర భయాందోళలకు గురి చేశారు. అణ్వాయుధాల సంఖ్యలో అమెరికా ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉందని వెల్లడించారు. తమ తర్వాత రష్యా రెండో స్థానంలో.. ఆ తర్వాత చాలా వెనుకబడి చైనా మూడో స్థానంలో ఉందని తెలిపారు. అయితే.. వచ్చే 4, 5 ఏళ్లలో చైనా అమెరికాను చేరుకుంటుందని తీవ్ర హెచ్చరికలు చేశారు.
అమెరికా వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలమని.. ఆ అవసరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని పేర్కొన్న ట్రంప్.. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చర్చించినట్లు వెల్లడించారు. అణ్వాయుధాలపై ఖర్చు పెట్టే డబ్బును ప్రజలకు ప్రయోజనం కలిగించే ఇతర విషయాలపై ఖర్చు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
మరోవైపు.. 3 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలను అమెరికా తక్షణమే పునరుద్ధరిస్తున్నట్లు గత వారం ట్రంప్ ప్రకటించారు. రష్యా పోసిడాన్ వంటి అధునాతన అణ్వస్త్ర వ్యవస్థలను పరీక్షిస్తున్నందున.. తాము కూడా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించడం సరైందేని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. కొత్త పరీక్షల కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయని.. త్వరలో పరీక్షా స్థలాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
అణ్వాయుధాల విస్తరణను అరికట్టడానికి అమెరికా, రష్యా, చైనా మధ్య త్రైపాక్షిక సహకారం కోసం ఒక ప్రణాళికపై తాము పనిచేస్తున్నామని పరోక్షంగా ట్రంప్ సూచనలు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి ఉండాలని కోరుకుంటున్నామని.. దానిని సాధించడానికి దగ్గరగా ఉన్నామని ట్రంప్ అన్నారు. ప్రజలకు తెలియని ఎన్నో యుద్ధాలు జరిగాయని.. ప్రస్తుతం అవి లేవని పేర్కొన్నారు.
తాను అధ్యక్షుడిగా ఉన్న మొదటి టర్మ్లో అమెరికా అణ్వస్త్ర వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించినట్లు ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు. రష్యా, చైనాలు అణ్వస్త్రాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయనే వార్తలు వెలువడుతున్న వేళ.. ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa