ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 07:32 AM

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి వివేకా కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్‌లపై తప్పుడు కేసు నమోదు చేయించారన్న ఆరోపణలతో ఇద్దరు విశ్రాంత పోలీసు అధికారులపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. విశ్రాంత ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డిలపై త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదు కానుంది. 2023 డిసెంబర్ 15న వివేకా వ్యక్తిగత సహాయకుడు  ఇచ్చిన ఫిర్యాదు మేరకు సునీత, సీబీఐ అధికారి రామ్ సింగ్‌పై కేసు నమోదైంది. అయితే, ఈ కేసు నమోదు ప్రక్రియలో అప్పటి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి తన ఇంట్లోనే ఫిర్యాదుదారుడి నుంచి వాంగ్మూలం తీసుకోగా, దాని ఆధారంగా ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి కేసు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు.అయితే, ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు, ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసని నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు 2025లో న్యాయస్థానంలో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారు. దీంతో, తప్పుడు కేసు నమోదు వెనుక ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు.ఈ క్రమంలో, లింగాలకు చెందిన కుళ్లాయప్ప అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విశ్రాంత అధికారులు రాజేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డిలపై కొత్తగా కేసు నమోదు చేయనున్నారు. ఒకప్పుడు ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసిన అధికారులే ఇప్పుడు నిందితులుగా మారనుండటం వివేకా హత్య కేసు విచారణలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa