ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు (సోమవారం) జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది.ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా విశాఖ వేదికగా జరిగే భాగస్వామ్య సదస్సు, జిల్లాల పునర్యవస్థీకరణ వంటి అంశాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు. నవంబర్14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను ఇప్పటికే మంత్రులకు అప్పగించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే మంత్రిమండలి సమావేశంలో భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై మంత్రులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.
అలాగే ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగే కేబినెట్ భేటీలో వీటికి ఆమోద తెలిపే అవకాశం ఉంది. వీటితో పాటుగా మొంథా తుఫాన్ కారణంగా ఏపీపై పడిన ప్రభావం, తుఫాను నష్టం అంచనాలు, పరిహారం వంటి అంశాల గురించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం కోసం NaBFID నుంచి రూ.7,500 కోట్ల రుణం తీసుకోవడానికి సీఆర్డీఏకు కేబినెట్ ఆనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పలు సంస్థలకు భూముల కేటాయింపుపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఇక అన్నింటికంటే ప్రధానంగా జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, నూతన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా ఏపీ కేబినెట్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశం మీద ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ఈ అంశాల గురించి చర్చించింది. నివేదిక కూడా రూపొందించినట్లు సమాచారం. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ఏపీ మంత్రిమండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపైనా సీఎం నారా చంద్రబాబు నాయుడు.. మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa