ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఇల్లు లేని వారికి అద్భుత అవకాశం.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 07:10 PM

రాష్ట్రంలోని పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద పేదలకు ఇళ్లు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం కోసం దరఖాస్తు గడువు తాజాగా ముగియగా.. అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఏపీ ప్రభుత్వం గడువును పొడిగించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే అర్హత, ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టారు. నవంబర్ 5వ తేదీతో ఈ దరఖాస్తు గడువు ముగిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరటంతో కేంద్రం ఈ గడువును నవంబర్ నెలాఖరు వరకూ పొడిగించింది. దీంతో ఆసక్తి, అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు వారాలు సమయం ఉంది. దీని వలన మరింత మందికి మేలు కలుగుతుందని అధికారులు చెప్తున్నారు.


దరఖాస్తు చేసే విధానం..


ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేయాలనుకునేవారు సచివాలయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ను సంప్రదించాలి. ఇంజనీర్ అసిస్టెంట్ సాయంతో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుంది. ఇక దరఖాస్తు చేసుకోవటానికి ముందు వారికి సొంత స్థలం, దానికి సంబంధించిన పట్టా ఉండాలి. అలాగే నివాస స్థలంలో లబ్ధిదారు ఫొటో తప్పనిసరి. పేరు, ఆధార్ కార్డు నంబర్, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ను సంప్రదించి.. వారి సాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.


మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మించుకునేవారికి ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా అండగా నిలుస్తాయి. పట్టణాలు, మున్సిపాలిటీలలో ఉన్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ. 2.89 లక్షలవరకు అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 1.59 లక్షలు వరకూ ఇస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల వారికి అందించే ఆర్థిక సాయం తక్కువగా ఉండటంతో మరింత సాయం అందించాలని కోరుతున్నారు. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గడువు పొడిగించటంతో అర్హత, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకాన్ని ఉపయోగించుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని సూచిస్తున్నారు. దరఖాస్తులను గృహ నిర్మాణ సంస్థ, సచివాలయాలలో అందించవచ్చని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa