ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీనియర్ లాయర్ విమర్శలకు శశిథరూర్ కౌంటర్

national |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 07:23 PM

బీజేపీ కురువృద్ధుడు, మాజీ డిప్యూటీ ప్రధాన మంత్రి లాల్ కృష్ణ అద్వానీపై ఓ సీనియర్ లాయర్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ నేతగా అద్వానీ దేశానికి ఎంతో సేవ చేశారని ప్రశంసించారు. ఈ క్రమంలో మాజీ ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీల మాదిరిగా ఒక్క సంఘటనతో దశాబ్దాలుగా చేసిన ప్రజా సేవను అంచనా వేయడం సరికాదని థరూర్‌ హితవు పలికారు. అద్వానీ 98వ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ఆయనకు తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో ఉన్న ఫోటోను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేస్తూ... ‘ఆదర్శప్రాయమైన వ్యక్తి’.. ప్రజా సేవ పట్ల అచంచలమైన నిబద్ధత కలిగిన నిజమైన రాజనీతిజ్ఞుడు’ అని ట్వీట్ చేశారు.


‘‘ఎల్కే అద్వానీకి 98వ జన్మదిన శుభాకాంక్షలు.. ప్రజా సేవ పట్ల ఆయన అచంచలమైన నిబద్ధత, విశ్వాసం, ఆధునిక భారత దిశను రూపుదిద్దడంలో ఆయన పాత్ర ఇవన్నీ చెరగని గుర్తులుగా నిలిచాయి. నిరంతర ప్రజాసేవలో నిబద్దత కలిగిన నిజమైన రాజనీతిజ్ఞుడు’’ అని థరూర్ చేసిన ట్వీట్‌పై సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే స్పందదించారు. తాను థరూర్ అభిప్రాయంతో ఏకీభవించడం లేదని అన్నారు. ‘సారీ శశిథరూర్.. ఈ దేశంలో ‘ద్వేషం’ అనే విషబీజాలు (కుష్వంత్ సింగ్ చెప్పినట్టు) నాటడం ప్రజాసేవ కాదు’ అని విమర్శించారు. 1990లో బీజేపీ సీనియర్ నేత అద్వానీ చేపట్టిన రథయాత్ర బాబ్రీ మసీదు కూల్చివేతకు కారణమైందనే విమర్శలు ఉన్నాయి.


దీనిపై శశిథరూర్ స్పందిస్తూ. ‘‘దేశ ప్రజలకు అద్వానీ చేసిన సుదీర్ఘ సేవను ఒక్క సంఘటనను చూపించి తగ్గించలేం.. చైనా యుద్దంలో ఎదురుదెబ్బతో జవహర్‌లాల్ నెహ్రూ రాజకీయ జీవితాన్ని... అత్యవసర పరిస్థితి కారణంగా ఇందిరా గాంధీ రాజకీయ జీవితాన్ని మాత్రమే నిర్వచించలేనట్లే, ఆద్వానీకి కూడా అదే న్యాయం వర్తిస్తుంది’’ అని అన్నారు.


కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా శశిథరూర్ కొద్ది రోజులు వ్యాఖ్యలు చేస్తుండడంతో సొంత పార్టీ నుంచే ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో విదేశాలకు భారత్ తరఫున వెళ్లిన ఎంపీల బృందంలో ఒకదానికి థరూర్ నాయకత్వం వహించారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలను సైతం థరూర్ ధిక్కరించడంతో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, వీటిని ఖండించిన ఆయన తాను ఎప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని తేల్చిచెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa