ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరైనా మతాన్ని వదిలిపెట్టి వస్తే చేర్చుకుంటాం

national |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 07:24 PM

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కేవలం విధానాలకు మాత్రమే మద్దతు ఇస్తుందని, ఏ ఒక్క వ్యక్తికో లేదా రాజకీయ పార్టీకో కాదని ఆ సంస్థ అధ్యక్షుడు మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అయోధ్యలోని రామమందిర నిర్మాణం డిమాండ్‌కు కాంగ్రెస్ మద్దతిస్తే.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీకి మద్దతు ఇచ్చేవాళ్లని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల వార్షికోత్సవం సందర్భంగా బెంగళూరులో నవంబరు 9న ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము ఏ ఒక్క రాజకీయ పార్టీకి విధేయులం కాదని తేల్చిచెప్పారు.


‘‘మేము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వం.. ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనం.. సమాజం ఐక్యత కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది.. రాజకీయాలు విభజిస్తాయి.. మేము కేవలం విధానాలకే మద్దతు ఇస్తాం.. ఉదాహరణకు మేము అయోధ్యలో రామమందిరం కోరుకున్నాం.. కాబట్టి ఆలయం ఎవరు నిర్మిస్తే వారికే మా స్వయంసేవకులు మద్దతుగా ఉన్నారు’’ అని తెలిపారు. ‘‘కాంగ్రెస్ దానికి మద్దతు ఇచ్చి ఉంటే, మా స్వయంసేవకులు ఆ పార్టీకి ఓటు వేసేవారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.


‘‘మాకు ఒక పార్టీతోనే ప్రత్యేకమైన అనుబంధం లేదు.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ పార్టీ కాదు.. అన్ని పార్టీలు మావే ఎందుకంటే అవి భారతీయ పార్టీలు.. మేము కేవలం విధానాలకు మాత్రమే మద్దతు తెలుపుతాం రాజకీయాలకు కాదు.. మాకు మా అభిప్రాయాలు ఉన్నాయి... ఈ దేశం ఒక నిర్దిష్ట దిశలో వెళ్లాలని మేము కోరుకుంటున్నాం. దేశాన్ని ఆ దిశలో నడిపించే వారికి మేము మద్దతు ఇస్తాం’’ అని మోహన్ భగవత్ ఉద్ఘాటించారు.


ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్‌లోకి ముస్లింలను అనుమతిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘‘బ్రాహ్మణులను అనుమతించం.. ఇతరు కులాలకు అనుమతిలేదు.... ముస్లింలకు అనుమతి లేదు, క్రైస్తవులకు అనుమతి లేదు... అయితే, భిన్న మతాలకు చెందినవారు వాళ్లు ముస్లింలైనా, క్రైస్తవులైనా తమ మతపరమైన భిన్నత్వాన్ని వదిలిపెట్టి ఆర్ఎస్ఎస్‌లోకి రావచ్చు.. అందులోకి వచ్చినప్పుడు భారతమాత బిడ్డగా వస్తారు. ముస్లింలు , క్రైస్తవులు వస్తారు, కానీ మేము వారి సంఖ్యను లెక్కించం, వారు ఎవరో అడగం’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యానించారు.


అలాగే, పలువురు కాంగ్రెస్ నాయకులు తరుచూ లేవనెత్తుతోన్న ‘ఆర్ఎస్ఎస్‌‌ నమోదు’ అంశంపై కూడా మోహన్ భగవత్ స్పందించారు. ‘దీనికి సమాధానం చాలాసార్లు చెప్పాం... కానీ, ఈ ప్రశ్నను తిరిగి తిరిగి అడుగుతారు.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 1925లో ప్రారంభమైంది. అప్పట్లో మేము బ్రిటిష్ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ చేసుంటామని భావిస్తున్నారా? స్వాతంత్య్రం అనంతరం చట్టాలు కూడా నమోదు తప్పనిసరి చేయలేదు.. ‘బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్’ (వ్యక్తుల సమూహం) అనే రూపంలో కూడా చట్టబద్ధ హోదా ఉంది. సంఘ్‌ను కూడా అటువంటి సమూహంగా వర్గీకరించాం.. మేము గుర్తింపు పొందిన సంస్థే’ అని పేర్కొన్నారు.


‘మూడుసార్లు ఆర్ఎస్ఎస్‌పై నిషేధం విధించారంటే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించినట్టే.. మేము లేకపోతే, ఎవరిని నిషేధించారు? ప్రతిసారీ కోర్టులు ఆ నిషేధాన్ని రద్దు చేశాయి. అసెంబ్లీ, పార్లమెంటులోనూ ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ ఎన్నోసార్లు ప్రశ్నలు అడిగారు.. చట్టపరంగా, వాస్తవపరంగా చూస్తే సంఘ్ సంస్థే. మేము రాజ్యాంగ విరుద్ధం కాదు కాబట్టి, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఎన్నో సంస్థలు ఉన్నాయి.. అవి కూడా నమోదు కాలేదు. హిందూ ధర్మం కూడా నమోదు కాలేదు’అని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్‌‌పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు నాయకులు విమర్శలు గుప్పిస్తోన్న వేళ.. భగవత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa