ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడాదిగా నిఘా పెట్టిన గుజరాత్ ఏటీఎస్,,,ముగ్గురు టెర్రరిస్ట్‌లు అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Sun, Nov 09, 2025, 07:27 PM

భారత్‌లో మరోసారి ఉగ్రవాదులు కలకలం రేపారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన.. ముగ్గురు ఉగ్రవాదులను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ అరెస్ట్ చేసింది. దీంతో ఉగ్రవాదులు చేసిన భారీ ఉగ్ర కుట్రను భద్రతా అధికారులు భగ్నం చేశారు. ఐసిస్‌తో సంబంధమున్న వ్యక్తులు దేశవ్యాప్తంగా దాడులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై.. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చినట్లు వెల్లడించిన అధికారులు.. ఉగ్రవాదుల వద్ద 3 పిస్తోళ్లు, 30 క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ఉగ్రవాదులకు దాదాపు 25 ఏళ్ల వయసు ఉన్నట్లు తెలిపారు. కాగా, కశ్మీర్‌లో దాడులకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు సంయుక్తంగా ప్లాన్ చేసినట్లు ఇటీవల నిఘా వర్గాలు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


ఏడాదిగా మా రాడార్‌లోనే..


గుజరాత్ ఏటీఎస్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రవాదులను డాక్టర్ అహ్మద్ మొహిద్దిన్ కాదర్ జిలానీ, మొహమ్మద్ సుహే మొహమ్మద్ సులేమాన్, ఆజాద్ సులేమాన్ సైఫిలుగా గుర్తించారు. ఈ ముగ్గురిపై గతేడాది నుంచి భద్రతా బలగాలు నిఘా ఉంచాయి. వీరు ఆయుధాలు ఎక్ఛేంజ్ చేసేందుకు గుజరాత్‌కు వచ్చారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయాలని ప్లాన్‌ చేశారు. వీరు రెండు ఉగ్ర సంస్థలకు చెందిన వారుగా అనుమానాలు ఉన్నాయని ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఏయే ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేశారో గుర్తించడానికి ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైనట్లు ఏటీఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది. దర్యాప్తు కొనసాగుతోందని.. ఈ విషయంలో తదుపరి వివరాలు తెలియాల్సి తెలిపింది.


మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ఐదుగురు అల్‌-ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో టెర్రర్‌ మాడ్యూల్‌ను నడుపుతున్నవారితో పాటు పాక్‌లో ఉన్న ఉగ్రవాదులతో సంబంధాలు నెరపిన మహిళ కూడా వారిలో ఉండటం గమనార్హం. అంతకుముందు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు రావడంతో జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఇద్దరు ఎస్పీఓలపై వేటు పడింది. ఉగ్ర కార్యకలాపాలకు వీరు సాయం చేస్తున్నట్లు తేలడంతో.. విధుల నుంచి అబ్దుల్‌ లతీఫ్‌, మహ్మద్‌ అబ్బాస్‌ తొలగించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చసి దోడా జైలుకు తరలించారు.


ఇటీవల పుణేలో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జుబేర్ హంగార్గేకర్‌ను.. మహారాష్ట్ర ఏటీఎస్ అరెస్ట్ చేసింది. అల్ ఖైదా సంస్థకు సంబంధించిన నిషేధిత సాహిత్యాన్ని తన ల్యాప్‌టాప్‌లో కలిగి ఉన్నందుకు.. అతడి అరెస్ట్ చేశారు. అంతకుముందు అక్టోబర్ 9న నిర్వహించిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న 19 ల్యాప్‌టాప్‌లలో ఒకటైన జుబేర్ ల్యాప్‌టాప్‌లో.. ఈ అల్ ఖైదా సాహిత్యం దొరికింది. జుబేర్, ఉగ్రవాద సంస్థ సభ్యులతో సంబంధాలు కలిగి ఉన్నాడా.. ఈ సాహిత్యాన్ని ఎందుకు ఉంచుకున్నాడు అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa