బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ మంగళవారం ఉదయం నుంచే జోరుగా సాగుతోంది. తొలి దశ సరళిలోనే రెండో విడతలోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే, సాయంత్రం ముగిసేసరికి సరికొత్త రికార్డు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయానికే 47 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఇదే సమయానికి తొలి దశలో నమోదైన ఓటింగ్ శాతంతో పోలిస్తే ఇది దాదాపు 5 శాతం అధికం. దీంతో రెండో దశలోనూ రికార్డు స్థాయిలో ఓట్లు పోలవుతాయన్న అంచనాలు బలపడుతున్నాయి. ఎన్నికల సంఘం అధికారిక లెక్కల ప్రకారం గయ, జమూయి, బంకా జిల్లాల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. తూర్పు, పశ్చిమ చంపారన్, పూర్నియా, కతిహార్ వంటి ఇతర జిల్లాల్లోనూ 48 శాతానికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగాల్ సరిహద్దులో ఉన్న, ముస్లిం జనాభా అధికంగా ఉండే కిషన్గంజ్ జిల్లాలో మధ్యాహ్నం 1 గంటకే అత్యధికంగా 51.86 శాతం పోలింగ్ నమోదవడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa