సనాతన ధర్మాన్ని, హిందువుల మనోభావాలను పరిరక్షించేందుకు 'సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు'ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్త హిందూ సమాజానికి కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదని, అదొక పవిత్రమైన ఆధ్యాత్మిక గమ్యస్థానం అని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ, "తిరుపతి లడ్డూ కేవలం ఒక స్వీట్ కాదు, అది మనందరి ఉమ్మడి భావోద్వేగం. స్నేహితులు, కుటుంబ సభ్యులు, చివరికి అపరిచితులతో కూడా మనం ఆ ప్రసాదాన్ని పంచుకుంటాం. ఎందుకంటే, అది మన సామూహిక విశ్వాసానికి, ప్రగాఢ భక్తికి ప్రతీక" అని వివరించారు. ఏటా సగటున 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తారని గుర్తుచేశారు."సనాతనుల మనోభావాలను, ఆచారాలను ఎగతాళి చేసినప్పుడు లేదా కించపరిచినప్పుడు అది కేవలం బాధ కలిగించడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. లౌకికవాదం అనేది రెండు వైపులా ఉండాలి. మా విశ్వాసానికి రక్షణ, గౌరవం ఇవ్వడంలో రాజీ పడకూడదు" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.మన సనాతన ధర్మం అత్యంత పురాతనమైన, నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికత అని పేర్కొన్న పవన్, భాగస్వాములందరి ఏకాభిప్రాయంతో 'సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు'ను స్థాపించడానికి ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa