ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనసులో అనుకునేది తెలిసిపోతోంది.. వాళ్లు దెయ్యాలే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 07:15 PM

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కన్న తల్లి, తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన భీమవరంలో కలకలం రేపింది. సుమారుగా 30 సార్లు కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేయడం స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. భీమవరంలోని సుంకర పద్దయ్య వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహాలక్ష్మి అనే 60 ఏళ్ల మహిళ తన ఇద్దరు కొడుకులు, కూతురితో కలిసి ఈ వీధిలో నివసిస్తున్నారు. పెద్దవాడి పేరు శ్రీనివాస్ కాగా.. చిన్నవాడి పేరు రవితేజ. మహాలక్ష్మి భర్త కరోనా సమయంలో చనిపోయారు. ఆమె కుమార్తె ప్రస్తుతం బెంగళూరులో ఉంటోంది. దీంతో రవితేజ, శ్రీనివాస్‌లతో కలిసి మహాలక్ష్మి భీమవరంలో ఉంటున్నారు.


అయితే శ్రీనివాస్ వయసు 37 ఏళ్లు, రవితేజ వయసు 33 ఏళ్లు. వీరికి ఇంకా పెళ్లి కాలేదు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. సోమవారం తెల్లవారుజామున రవితేజ, మహాలక్ష్మిని శ్రీనివాస్ దారుణంగా హత్య చేశాడు. 3 గంటల సమయంలో చాకుతో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీసులకు ఫోన్‌ చేసిన శ్రీనివాస్.. హత్యలు చేసిన విషయం వారికి చేరవేశాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ హత్యల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ్ముడు రవితేజను శ్రీనివాస్ 30 సార్లు పొడిచినట్లు అతని శరీరంపై ఉన్న గాయాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఇక మహాలక్ష్మి కడుపులో నుంచి పేగులు కూడా బయటకు వచ్చి ఉండటంతో.. చనిపోయిన తర్వాత కూడా శ్రీనివాస్ వారిని కత్తితో పొడుస్తూ ఉండి ఉండొచ్చని భీమవరం పోలీసులు అనుమానిస్తున్నారు.


మరోవైపు పోలీసుల వద్ద శ్రీనివాస్ షాకింగ్ విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అమ్మ, తమ్ముడు తనను ఇంట్లో బంధించారని.. తన మనసులో ఏం మాట్లాడుకునేది వారికి తెలిసిపోతోందని చెప్పినట్లు సమాచారం. అలాగే కత్తితో పొడిచిన తర్వాత.. వారిద్దరూ రక్తపుమడుగులో కొట్టుకోవడం చూస్తే.. చనిపోయిన తర్వాత కూడా వారిద్దరూ దెయ్యాలై వచ్చి వేధించేలా ఉన్నారంటూ శ్రీనివాస్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. మరోవైపు నిందితుడు శ్రీనివాస్‌కు మానసిక స్థితి సరిగా లేకపోవటమే ఘటనకు కారణంగా భీమవరం పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తనను ఇంట్లోనే బంధించి, చిన్నకొడుకు రవితేజకు మహాలక్ష్మి బాధ్యతలు అప్పగించి.. తనను తక్కువగా చూస్తోందనే కోపంతోనే ఈ హత్యలు చేసినట్లు శ్రీనివాస్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. మొత్తంగా ఈ ఘటన భీమవరం వాసులను ఉలిక్కిపడేలా చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa