స్కూల్లో చదివే ఇద్దరమ్మాయిలు పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టారు. నాలుగు రోజుల పాటూ కనిపించకుండా మాయమైపోయారు. పోలీసులు టెక్నాలజీ సాయంతో ఆ ఇద్దరు అటవీ ప్రాంతంలోని ఓ గుహలో ఉన్నట్లు కనిపెట్టారు. నాలుగు రోజుల పాటూ అక్కడ ఎందుకు దాక్కున్నారని ప్రశ్నిస్తే.. వారు చెప్పిన సమాధానంతో అందరూ అవాక్కయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
అల్లూరి జిల్లా పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరుకు చెందిన బాలికలు పెదబయలు ఆశ్రమ బాలికల పాఠశాల-1లో చదువుకుంటున్నారు. ఒకరు ఐదో తరగతి, మరొకరు ఆరో తరగతి చదువుతున్నారు. వీరిద్దరు ఉన్నట్టుండి ఈ నెల 6న కనిపించకుండా పోయారు.. స్కూల్లో ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్లిపోయారు. ఈ నెల 6, 7 తేదీల్లో వాళ్లే తిరిగి వస్తారని స్కూల్ సిబ్బంది భావించారు. కానీ రెండు రోజులు గడిచినా రాకపోవడంతో.. ఈ నెల 8న స్కూల్ సిబ్బంది ఫిర్యాదు చేయగా.. పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరమ్మాయిల్ని గాలించేందుకు మూడు టీమ్లను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. శనివారం ( నవంబర్ 8న), ఆదివారం (నవంబర్ 9న) అమ్మాయిల కోసం గాలించినా ఆచూకీ దొరకలేదు.
ఈ క్రమంలో సోమవారం (నవంబర్ 10న) డ్రోన్ల సహాయంతో అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. డ్రోన్ అలా ఎగరగానే వారిద్దరి ఆచూకీ దొరికింది. చివరికి ఇద్దరమ్మాయిలు కొంచూరు కొండల్లోని గుహలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చి.. వారి సాయంతో ఇద్దరిని గుహ నుంచి బయటకు తీసుకొచ్చారు.. అక్కడి నుంచి తీసుకెళ్లి తల్లిదండ్రులకు జాగ్రత్తగా అప్పగించారు. ఇంతకీ ఈ ఇద్దరు స్కూల్ నుంచి ఎందుకు పారిపోయారని అడిగితే.. తాము చదువులో వెనుకబడ్డామని, అందుకే పారిపోయినట్లు చెప్పారు. వీరు ఈ నాలుగు రోజులు పాటూ అడవిలో దొరికే దుంపలు తిని నీళ్లు తాగేవారు.. ఎవరికీ కనిపించకుండా గుహలో దాక్కున్నారు. చివరికి పోలీసుల సాయంతో.. వీరిద్దరి ఆచూకీ దొరకడంతో తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa