తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. పరమ పవిత్రమైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాల చెంత మెట్ల మార్గంలో మాంసాహార భోజనం తింటున్న టీటీడీ సిబ్బంది వ్యవహారం బయటపడింది. టీటీడీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మెట్లమార్గంలో ఒకచోట కూర్చొని భోజనం చేస్తున్నారు.. వారి లంచ్ బాక్సుల్లో తీసుకొచ్చిన మాంసాహార భోజనం తింటున్నారు. ఈ విషయాన్ని అటువైపుగా వెళుతున్న భక్తులు కొందరు గుర్తించారు.. పవిత్రమైన తిరుమల చెంత మాంసాహారం ఎందుకు తింటున్నారని ప్రశ్నించారు. శ్రీవారి భక్తులు ఈ అంశంపై వెంటనే టీటీడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.. ఈ తతంగాన్ని వీడియో తీశారు. అయితే శ్రీవారి భక్తులని కూడా టీటీడీ సిబ్బంది బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియోలో భక్తులు ప్రశ్నించిన సమయంలో ఊరి నుంచి తెచ్చారంటూ సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఎవరు తెచ్చినా ఇలా తినడం తప్పు కదా అంటూ ప్రశ్నించారు.
'తిరుమలలో మరోసారి మహాపచారం. పరమ పవిత్రమైన శ్రీవారి పాదాల చెంత.. మెట్ల మార్గంలో మాంసాహార భోజనం తింటున్న టీటీడీ సిబ్బంది. ఏంటి ఈ అపచార పనులు అని ప్రశ్నించిన శ్రీవారి భక్తులని బెదిరించిన టీటీడీ సిబ్బంది. టీటీడీ విజిలెన్స్ విభాగం నిద్రపోతోందా? ఇదేనా దేవాలయాల్ని ప్రక్షాళన చేయడమంటే ఇదేనా.. టీటీడీ విజిలెన్స్ విభాగం నిద్రపోతోందా? ఇదేనా దేవాలయాల్ని ప్రక్షాళన చేయడమంటే' అంటూ వైఎస్సార్సీపీ కూడా వీడియోను ట్వీట్ చేసింది. మాంసాహారం తిన్న పారిశుద్ధ్య కార్మికులపై టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా తిరుమలలో మాంసాహారం బయటపడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరో ఘటన జరగడం సంచలనంగా మారింది. ఈ అంశంపై టీటీడీ స్పందించింది.. 'టీటీడీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది రామస్వామి , సరసమ్మలు ఆదివారం రోజు అలిపిరి దగ్గర మాంసాహారం తినినట్లు మా దృష్టికి వచ్చింది. అందుకే రామస్వామి , సరసమ్మ అనే ఇద్దరు సిబ్బందిపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. అలాగే సదరు ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించాము' అని తెలిపారు
'నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నవంబరు 11వ తేది మంళవారం నాడు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన, శుధ్ధి నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 11న, నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు' అని టీటీడీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa