ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక ఘట్టానికి విశాఖ నగరం వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు ఈరోజు ఉదయం అట్టహాసంగా ప్రారంభం కానుంది. భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా సుమారు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సదస్సు ప్రారంభానికి ముందే సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో రూ. 3.65 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కుదరడం ప్రభుత్వ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.ఈ 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశాల నుంచి భారీ స్పందన లభించింది. 50కి పైగా దేశాల నుంచి మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల సీఎక్స్ఓలు సహా సుమారు 3000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు మొత్తం 45 సెషన్లు జరగనుండగా తొలి రోజు 25 సెషన్లను నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వాణిజ్యం, పారిశ్రామికీకరణ, టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి ఏడు కీలక అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.సదస్సు ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను ప్రారంభించనున్నారు. "వికసిత్ భారత్ కోసం ఏఐ" అనే అంశంపై జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా దోహదపడుతుందో వివరించనున్నారు. అనంతరం జపాన్ రాయబారితో పాటు బీపీసీఎల్, గోయెంకా, ఎస్బీఎఫ్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ఆయన విడివిడిగా సమావేశమవుతారు. సాయంత్రం విజయవాడ నుంచి సింగపూర్కు నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు సింగపూర్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది.మరోవైపు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. యాక్షన్ టెసా, బ్లూ జెట్ హెల్త్కేర్, డిక్సన్ టెక్నాలజీస్, భారత్ బయోటెక్, కిర్లోస్కార్ గ్రూప్ వంటి సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. అలాగే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సింగపూర్ జాతీయ భద్రతా మంత్రి షణ్ముగంతో కూడా లోకేష్ విడిగా భేటీ కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, మంత్రులు విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఈ సదస్సుపై అంచనాలు భారీగా పెరిగాయి. తొలి రోజు సదస్సు ముగిశాక ప్రతినిధుల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa