ప్రస్తుత రోజుల్లో నిత్యం ఎన్నో మోసాలు, మరెన్నో ఘోరాలు వెలుగుచూస్తున్నాయి. మన చుట్టుపక్కల కూడా ఎంతో మంది వీటికి బలి అవుతున్నారు. బాధితులుగా మారుతున్నారు. అయినప్పటికీ అవగాహన లేకపోవటం మూలంగానో.. అత్యాశ కారణంగానే మోసాలు.. జరుగుతూనే ఉన్నాయి. బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. మోసపోయేవాడు ఉన్నన్ని రోజులు మోసగించేవాడు పుట్టుకువస్తూనే ఉంటాడనే చందంగా పరిస్థితి తయారైంది. విశాఖపట్నంలో తాజాగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరిట జరిగిన సైబర్ మోసంలో ఓ వ్యక్తి ఏకంగా రూ.6 కోట్లు పోగొట్టుకున్నాడు. ఆనక అసలు మోసం తెలిసి పోలీసులను ఆశ్రయించాడు.
విశాఖపట్నంలోని మధురవాడకు చెందిన ఓ వ్యక్తి.. వయసు 55 ఏళ్లు. ఆ వ్యక్తికి సోషల్ మీడియా వాడకం ఓ అలవాటు. ఈ క్రమంలోనే ఆయనను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఓ మహిళ పరిచయమైంది. ఫ్రెండ్ రిక్వెస్ట్ ద్వారా మొదలైన పరిచయం.. ఆ తర్వాత చాటింగ్ వరకూ వెళ్లింది. చాట్ చేసే క్రమంలో ఆ మహిళపై ఈయన నమ్మకం పెంచేసుకున్నాడు. బాగా నమ్మకం కుదిరిందనుకున్న తర్వాత.. సదరు మహిళ తన ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టింది. బాగా లాభాలు వస్తాయని ఆశ చూపించి.. మధురవాడ వ్యక్తితో కొన్ని
మోసపూరిత యాప్ల పేర్లు చెప్పింది. వాటి మీద అతనికి ఆసక్తి వచ్చేలా చేసింది.
ఆ తర్వాత అసలు మోసం మొదలైంది. కొంతమంది అతన్ని ఆన్ లైన్ ద్వారా సంప్రదించారు. పెట్టుబడి పెట్టాల్సిన కంపెనీలు ఇవేనని.. ఇవి వాటి తాలూకూ బ్యాంక్ అకౌంట్ల వివరాలు అంటూ కొన్ని నంబర్లు పంపించారు. ఈ బ్యాంక్ అకౌంట్లకు పెట్టుబడి సొమ్ము పంపించాలని నమ్మబలికారు. దీంతో ఓ సారి 50 వేలు, మరోసారి రూ.5 లక్షలు పంపించాడు మనోడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మహిళ మామను అంటూ మరో వ్యక్తి సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ట్రేడింగ్ కంపెనీల గురించి ఈ మధురవాడ వ్యక్తికి చెప్పి..అందులో పెట్టుబడి పెట్టాలంటూ ప్రోత్సహించాడు. అసలు మోసాన్ని గ్రహించలేకపోయిన విశాఖవాసి.. రెండు నెలల గ్యాప్లో రూ. 6 కోట్లు వివిధ బ్యాంక్ అకౌంట్లకు పంపించాడు.
అయితే పెట్టుబడి పెట్టిన తర్వాత లాభం ఆశించడం సహజం కదా. ఆ ఉద్దేశంతోనే లాభాల మాటేమిటంటూ ఆ మహిళను ప్రశ్నించాడు. దీంతో మరో నాటకం మొదలు పెట్టిందా మహిళ. లాభం తీసుకోవాలంటే 20 లక్షల రూపాయలతో పాటుగా.. ప్రాసెసింగ్ ఫీజు ఖర్చులు కలిపి రూ. కోటి చెల్లించాలని ఒత్తిడి చేసింది. అయితే అంత మొత్తం చెల్లించేందుకు విశాఖవాసి ఒప్పుకోలేదు. తన డబ్బులు కావాలంటూ పట్టుబట్టాడు. దీంతో మహిళ, మరో వ్యక్తి అతనిపై బెదిరింపులకు దిగారు.
ఈ క్రమంలోనే నకిలీ లీగల్ నోటీసుల సాయంతో అతన్ని భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు. దీంతో తాను మోసపోయిన సంగతి గ్రహించిన ఆ వ్యక్తి.. విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa