నేటి డిజిటల్ యుగంలో మన రోజువారీ అవసరాలన్నీ మొబైల్ ఫోన్ ద్వారానే జరిగిపోతున్నాయి. వస్తువులు ఆర్డర్ చేయడం నుంచి, చెల్లింపుల వరకు అంతా ఆన్లైన్ మయం. ఎంత వేగంగా డిజిటల్ సేవలు పెరుగుతున్నాయో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్లు అమాయకులకు మాత్రమే కాకుండా.. ఉన్నత స్థాయిలో ఉన్న చదువుకున్న వ్యక్తులకు కూడా వల వేసి వారి ఖాతాల్లోని నగదును సునాయాసంగా కాజేస్తున్నారు.
ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్కే వల...
తాజాగా హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన.. సైబర్ నేరగాళ్లు ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్న వారిని కూడా మోసం చేయగలరని నిరూపించింది. ఏకంగా ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ సైబర్ మోసానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఆ అధికారి Jubliehillswinespot.in అనే వెబ్సైట్ నుంచి వైన్ ఆర్డర్ చేశారు. మొదట రూ. 2,320 గూగుల్ పే ద్వారా చెల్లించారు.
అనంతరం.. హోమ్ డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉందని, దాని కోసం కొంత అదనపు మొత్తం చెల్లిస్తే ఇంటికే డెలివరీ చేస్తామని సైబర్ నేరగాళ్లు మరో స్కానర్ను (QR కోడ్) పంపారు. ఆ స్కానర్ను స్కాన్ చేసిన వెంటనే.. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఖాతా నుంచి రూ. 40,000 డెబిట్ అయిపోయాయి. ఈ సైబర్ క్రైమ్ సంఘటనతో షాకైన అధికారి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతటి ఉన్నత విద్యావంతులు, ఉన్నతాధికారులు కూడా మోసపోవడానికి ప్రధాన కారణం సైబర్ నేరగాళ్ల కొత్త పద్ధతులు.
నేరగాళ్లు ఇప్పుడు కేవలం ఓటీపీ (OTP) అడగడం లేదు. డబ్బులు పంపడానికి ఉపయోగించే స్కానర్ను పంపి, ‘డెలివరీ ఫీజు’ లేదా ‘రిఫండ్"’ పేరుతో దాన్ని స్కాన్ చేయమని అడుగుతారు. ఒకసారి స్కాన్ చేసి పిన్ నంబర్ ఎంటర్ చేస్తే, డబ్బులు రావడానికి బదులు మన ఖాతా నుంచే డెబిట్ అవుతాయి. వీరు అసలైన వెబ్సైట్ల (మద్యం దుకాణాలు, డెలివరీ సర్వీసులు) పేర్లను పోలి ఉండే నకిలీ వెబ్సైట్లు లేదా ఫోన్ నంబర్లను సృష్టిస్తారు. కొన్నిసార్లు ‘మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అయింది’ లేదా ‘మీరు లాటరీ గెలిచారు’ వంటి భయాందోళనలు సృష్టించి, త్వరగా నిర్ణయం తీసుకునేలా చేస్తారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa