ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ నుంచి కేంద్ర మాజీమంత్రి సహా ముగ్గురు సస్పెండ్,,,బిహార్‌ బీజేపీలో తీవ్ర కలకలం

national |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 08:44 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాతి రోజే.. బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. బిహార్ ఎన్నికల సమయంలో.. బీజేపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ముగ్గురు సీనియర్ నేతలను సస్పెండ్ చేయడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర అలజడి రేపింది. ఇక సస్పెన్షన్ వేటు పడిన ముగ్గురిలో కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత ఆర్‌కే సింగ్ కూడా ఉండటం గమనార్హం. ఆర్‌కే సింగ్‌‌తోపాటు.. ఎమ్మెల్సీ అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్‌‌లపై వేటు పడింది.


ఇక బిహార్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయ ఇంఛార్జ్ అరవింద్ శర్మ ఈ ముగ్గురు నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీకి నష్టం కలిగించినందుకు గాను.. వారిని ఎందుకు బహిష్కరించకూడదో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశాలు జారీ చేశారు. ఆరా నియోజకవర్గం నుంచి గెలిచిన మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఆర్‌కే సింగ్ .. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి బీజేపీ నాయకత్వంపై, బిహార్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు.


ఇక మరీ ముఖ్యంగా బిహార్‌ బీజేపీలో కీలక నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఎన్నికల వ్యూహకర్త, జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేసిన అవినీతి ఆరోపణలకు తోడు.. ఆర్‌కే సింగ్ కూడా సామ్రాట్ చౌదరిపై తీవ్ర విమర్శలు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు. సామ్రాట్ చౌదరి, బిహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్‌ను.. హత్య నిందితులు అంటూ ఆర్‌కే సింగ్ అభివర్ణించడం తీవ్ర దుమారానికి కారణం అయింది. ఇలాంటి నాయకులకు ఓటు వేయడం కంటే.. నీళ్లలో మునిగి చావడం మంచిదని బిహార్ ఎన్నికలకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


ఈ సందర్భంగా సామ్రాట్ చౌదరి.. చదువుకున్న చదువుపై వచ్చిన అనుమానాలను ఆయన నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. జేడీయూకు చెందిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అనంత్ సింగ్‌ను టార్గె్ట్ చేస్తూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆర్‌కే సింగ్ తీవ్ర విమర్శలు చేసిన.. సామ్రాట్ చౌదరి, ఆర్‌కే సింగ్ కూడా తమ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.


బిహార్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఆర్‌కే సింగ్.. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పనిచేశారు. 2013లో బీజేపీలో చేరిన ఆర్‌కే సింగ్.. 2014, 2019లో ఆరా నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. 2014 నరేంద్ర మోదీ కేబినెట్‌లో.. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. బీజేపీ తీసుకున్న ఈ సస్పెన్షన్ నిర్ణయం కేవలం తాత్కాలిక ప్రక్రియ మాత్రమేనని.. త్వరలోనే ఈ ముగ్గురినీ పార్టీ నుంచి బహిష్కరించనున్నట్లు బిహార్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa