దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన కార్ బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న ఇద్దరిని అరెస్టు చేయడం ద్వారా విచారణ కీలక మలుపు తిరిగింది. ఇందులో ఒకరు పంజాబ్కు చెందిన సర్జన్ కాగా.. మరొకరు పశ్చిమ బెంగాల్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి. ఈ అరెస్టులు దేశవ్యాప్తంగా వ్యాపించిన 'వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్' ఉనికిని బలపరుస్తున్నాయి.
అరెస్ట్ అయిన ఎంబీబీఎస్ విద్యార్థిని పశ్చిమ బెంగాల్లోని ఉత్తర దినాజ్పూర్కు చెందిన జనిసూర్ అలియాస్ నిసార్ ఆలంగా గుర్తించారు. నిసార్ గతంలో హర్యానాలోని అల్-ఫలా యూనివర్సిటీలో చదువుకున్నాడు. అలాగే లుధియానాలో నివాసం ఉంటున్నాడు. ఉగ్రవాద సంస్థలతో అతనికి సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా సూరజ్పూర్ మార్కెట్లో నిసార్ను అదుపులోకి తీసుకున్నారు. అతని మొబైల్ లొకేషన్ డేటా ఆధారంగా అతని కదలికలపై నిఘా ఉంచిన అధికారులు.. అతని నుంచి పలు డిజిటల్ పరికరాలు, ముఖ్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణ సమయంలో నిసార్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అతనిపై ఉన్న అభియోగాలు, పేలుడుతో అతనికి ఉన్న ప్రత్యక్ష సంబంధాలపై ఎన్ఐఏ ఇంకా అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ.. అరెస్ట్ తర్వాత విచారణ నిమిత్తం అతన్ని సిలిగురికి తీసుకెళ్లనున్నారు.
నిసార్ అరెస్టుతో పాటు పంజాబ్లోని పఠాన్కోట్కు చెందిన 45 ఏళ్ల సర్జన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు సంవత్సరాలకు పైగా పఠాన్కోట్లోని ఒక ప్రైవేట్ వైద్య కళాశాల ఆసుపత్రిలో పని చేస్తున్న ఈ వైద్యుడు.. గతంలో ఫరీదాబాద్లోని అల్ ఫలా యూనివర్సిటీలో కూడా పని చేశారని పోలీస్ వర్గాలు తెలిపాయి. 'వైట్కాలర్ టెర్రర్ మాడ్యూల్' కేసులో ఉన్న ప్రధాన అనుమానితులతో ఈ డాక్టర్కు సంబంధాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. నవంబర్ 10వ తేదీన ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యవహారంలో ఎన్ఐఏ దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై సహా పలు నగరాల్లో దర్యాప్తు చేస్తోంది. ఇటీవల ముర్షిదాబాద్ నివాసి అయిన మొయినుల్ హసన్ ఇంటిపై కూడా దాడులు జరిగాయి.
నిసార్ ఆలం కుటుంబ సభ్యులు మాత్రం అతని నిర్దోషిత్వాన్ని నొక్కి చెబుతున్నారు. నిసార్ చదువుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడని.. చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనలేదని అతని బంధువులు అంటున్నారు. అయితే వైద్యులు, విద్యార్థులు వంటి ఉన్నత వర్గాలు ఉగ్రవాద మాడ్యూల్తో ముడిపడి ఉన్నాయనే వాస్తవం భద్రతా సంస్థల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ అరెస్టులు ఢిల్లీ పేలుడు కేసు విచారణలో కీలక మలుపుగా పరిగణించబడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa